ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి
అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
కలెక్టరేట్లో ప్రజల అర్జీల స్వీకరణ
కాకతీయ, ఖమ్మం : ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. కొణిజెర్ల మండలం దిద్దుపూడి గ్రామానికి చెందిన అమర్లపూడి భాస్కరరావు తమ భూమి సర్వే నంబర్లు 82, 83లో ఉందని తెలిపారు. సర్వే నంబర్ 81లో ఉన్న భూమిని సబ్ స్టేషన్ కోసం కేటాయించగా, హైకోర్టు కేసు పెండింగ్ కారణంగా ఆ స్థలం మార్పు జరిగిందన్నారు. అయినప్పటికీ అదే స్థలాన్ని డంపింగ్ యార్డ్కు కేటాయించారని ఆరోపిస్తూ పట్టా పాస్ పుస్తకాలు జారీ చేయాలని కోరారు. ఈ విషయంపై తహసిల్దార్కు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నేలకొండపల్లి మండలం ముఠాపురం పెద్దతండకు చెందిన గిరిజనులు సర్వే నంబర్ 663లో కేటాయించిన ఆరు ఎకరాల భూమిలో బంజారా భవన్, సేవాలాల్ మందిరం కోసం స్థలం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై కూడా సంబంధిత తహసిల్దార్కు చర్యల ఆదేశాలు ఇచ్చారు. చింతకాని మండలం పందిళ్లపల్లె గ్రామానికి చెందిన లక్ష్మీప్రియ అనంతసాగర్ రెవెన్యూ పరిధిలోని భూముల వివరాలను పట్టా పాస్ పుస్తకంలో నమోదు చేయాలని కోరగా, చింతకాని తహసిల్దార్కు తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసి ఎం. రాజేశ్వరి, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


