ఒత్తిడి లేకుండా పరీక్షలకు హాజరుకండి
పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మార్గదర్శనం
గత ప్రశ్నాపత్రాలతో ప్రాక్టీస్ చేయాలని సూచన
భక్త రామదాసు కళాక్షేత్రంలో మోటివేషన్ కార్యక్రమం
కాకతీయ, ఖమ్మం:పదో తరగతి పరీక్షలకు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన మోటివేషన్ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పదో తరగతి జీవితంలో కీలక మలుపని పేర్కొన్నారు. భయం పెంచుకుంటే చదివినదే మర్చిపోతామని, అందుకే ధైర్యంగా పరీక్షలకు హాజరుకావాలన్నారు. పరీక్షలకు ఇంకా రెండు వారాల సమయం ఉన్నందున ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నెల రోజుల పాటు జరిగే పరీక్షల్లో ఏకాగ్రతతో సిద్ధమైతే మంచి ఫలితాలు సాధ్యమని తెలిపారు.

ప్రాక్టీస్తోనే విజయం
గత సంవత్సరాల ప్రశ్నాపత్రాలతో స్వయంగా పరీక్షలు రాసి సాధన చేయాలని విద్యార్థులకు సూచించారు. ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ పరీక్షలు రాస్తే అంత విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. ఒలింపిక్ క్రీడాకారుల్లా ప్రతిరోజూ సాధన చేస్తేనే ఫలితం దక్కుతుందని ఉదాహరణ ఇచ్చారు. బలహీనమైన విషయాల్లో అదనపు సమయం కేటాయించాలని సూచించారు.పరీక్షల సమయంలో రోజుకు కనీసం ఆరు నుంచి ఏడు గంటలు నిద్ర తప్పనిసరిగా తీసుకోవాలని, ఎండల నేపథ్యంలో బయట ఆహారం తీసుకోకూడదని, తగినంత మంచినీరు త్రాగాలని సూచించారు. అనంతరం మిత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్షా కిట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి చైతన్య జైని, మోటివేషన్ వక్త గంపా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


