మధ్యాహ్న భోజనంపై ఆకస్మిక తనిఖీ
కాకతీయ, కూసుమంచి: కూసుమంచి మండలం జీళ్ళచెరువు గ్రామ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని గ్రామ సర్పంచ్ ఐతగాని వెంకటరమణ నాగేశ్వరరావు, వార్డు సభ్యులు పెండ్ర అంజయ్య, ఐతగాని నవీన్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్తో కలిసి మెనూ ప్రకారం అన్నం, కూరలు సిద్ధం చేశారా? నాణ్యత ఎలా ఉంది? అన్న అంశాలను సవివరంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి భోజనం రుచి, పరిమాణంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి, వంటశాల పరిశుభ్రతను పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారంతో కూడిన భోజనం అందించాల్సిన బాధ్యత అందరిదని అన్నారు. పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, తాగునీరు, వంటగది సదుపాయాల విషయంలో పంచాయతీ నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభివృద్ధి దృష్ట్యా మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగా అమలుకావాలని సూచించారు.


