పేదల గృహ స్వప్నాలకు ప్రభుత్వం తోడుగా
14 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరి పత్రాల అందజేత
అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమం చేరుస్తాం
: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కాకతీయ, మణుగూరు : పేదలకు గృహ వసతి కల్పించాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తోందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. సోమవారం మణుగూరు మండలంలోని ప్రజా భవన్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 14 మంది లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు ఉచిత గృహ నిర్మాణం చేసి స్థిర నివాసం కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల సంక్షేమాన్ని ప్రధానంగా తీసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. మండలానికి చెందిన అర్హులైన 14 మంది లబ్ధిదారులకు మంజూరి పత్రాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. ఇల్లు లభించడం ద్వారా కుటుంబాలకు భద్రతతో కూడిన జీవనం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
అర్హులందరికీ పథకాల హామీ
భవిష్యత్తులో కూడా అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అధికారులు పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధికారి వెంకటేశ్వర్లు, రెవెన్యూ శాఖ డీటి రామారావు, హౌసింగ్ విభాగం ఏఈ సంతోష్ కుమార్, మండల అధ్యక్షుడు పిరినాకి నవీన్, సింగారం సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.


