నిట్ విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
కాకతీయ,వరంగల్: వరంగల్లోని జాతీయ సాంకేతిక విద్యాసంస్థలో నిర్వహించిన వార్షిక ఉత్సవాల సందర్భంగా ఆహార విషబాధ ఘటన కలకలం రేపింది. మూడు రోజులుగా సాగిన వేడుకల చివరి రోజు రాత్రి సుమారు 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. వాంతులు, విరేచనాలు, అస్వస్థత లక్షణాలతో బాధపడిన విద్యార్థులను యాజమాన్యం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.
వేడుకల సమయంలో కొంతమంది విద్యార్థులు మద్యం సేవించినట్లు ప్రచారం జరుగుతోంది. కార్యక్రమం జరుగుతున్న వేళ భద్రతా సిబ్బంది మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న దృశ్యాలు బయటకు వచ్చినట్లు సమాచారం. అయితే అస్వస్థతకు నిజమైన కారణంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.
బయట నుంచి వచ్చిన ఆహార స్టాల్లో భోజనం చేసిన తర్వాతే ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు చెబుతున్నారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టి వాస్తవాలు వెల్లడించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


