కమలాపూర్లో ఘెర రోడ్డు ప్రమాదం
డివైడర్ను ఢీకొట్టి బైక్.. ఇద్దరు దుర్మరణం
శనిగరం గ్రామంలో విషాదఛాయలు
కాకతీయ, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఆదివారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మండలంలోని శనిగరం గ్రామానికి చెందిన నవీన్ కుమార్, నాగరాజు అనే యువకులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా లక్ష్మీపూర్ గ్రామం సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం, యువకులు వెళ్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగం తీవ్రంగా ఉండటంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనాస్థలంలోనే వారు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. అధిక వేగం లేదా వాహనం నియంత్రణ కోల్పోవడమే కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ దుర్ఘటనతో శనిగరం గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు సంఘటనా స్థలానికి చేరుకుని సంతాపం తెలిపారు. రాత్రి వేళల్లో జాగ్రత్తగా వాహనాలు నడపాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.



