కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా
ఒక రోజు పెన్షన్తో రూ.2.80 లక్షల చెక్కు అందజేత
వారం రోజుల్లో 2,500 కానిస్టేబుళ్ల బదిలీలు పూర్తి : మంత్రి జూపల్లి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ శాఖ విశ్రాంత ఉద్యోగుల సంఘం అండగా నిలిచింది. సభ్యులు తమ ఒక రోజు పెన్షన్ మొత్తాన్ని విరాళంగా ప్రకటించి రూ.2.80 లక్షల చెక్కును అందజేశారు. ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సౌమ్య కుటుంబానికి చెక్కును అందించారు. మంత్రి మాట్లాడుతూ కష్టకాలంలో సహోద్యోగి కుటుంబానికి విశ్రాంత ఉద్యోగులు చూపిన పెద్దమనసు అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఇప్పటికే రూ.కోటి ఆర్థిక సాయం, ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించినట్లు గుర్తుచేశారు. గంజాయి, అక్రమ మద్యం నియంత్రణలో కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఎక్సైజ్ శాఖలో పెండింగ్ బదిలీలపై స్పందిస్తూ వారం రోజుల్లో సుమారు 2,500 కానిస్టేబుళ్ల బదిలీలు పూర్తి చేస్తామని వెల్లడించారు. అనంతరం ఇతర హోదాల బదిలీలు చేపడతామని చెప్పారు. నాగర్కర్నూల్ జిల్లాలో జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన మంత్రి, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పర్యాటక రంగాభివృద్ధికి కొత్త విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.


