ప్రతి పేదవాడి ఇంటికి సంక్షేమ పథకాలు..
– ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కావొద్దు..
– ఆపదలో అండగా సీఎం రిలీఫ్ ఫండ్
– నేరుగా లబ్ధిదారులకే అందుతున్న సాయం
– కళ్యాణలక్ష్మి,షాదీ ముబారక్ 66 చెక్కులు రూ. 66,07,656
– సీఎం రిలీఫ్ ఫండ్ 61 చెక్కులు రూ. 38,50,000 చెక్కులు పంపిణీ
– ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి
కాకతీయ, రాయపర్తి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడి ఇంటికి చేరుతున్నాయని పాలకుర్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు.శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదిక, ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొని వివిధ గ్రామాల చెందిన అర్హులైన లబ్ధిదారులకు,సీఎం రిలీఫ్ ఫండ్ మొత్తం 61 చెక్కులు రూ.38,50,000,కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ 66 మందికి రూ.66,07,656 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద వాడి ఇంటికి సంక్షేమ పథకాలు చేర్చడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.ఆడపిల్ల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆ తల్లిదండ్రులకు కొండంత అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.గతంలో ప్రభుత్వ సాయం పొందాలంటే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదని,కానీ నేడు పారదర్శకంగా నేరుగా లబ్ధిదారులకే సాయం అందుతోందని తెలిపారు.అలాగే అనారోగ్యంతో బాధ పడుతూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకోలేని వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిదని కొనియాడారు.అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో తహసిల్దారు ముల్కనూరి శ్రీనివాస్,ఎంపీడీవో గుగులోత్ కిషన్,ఏవో గుమ్మడి వీరభద్రం,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కళ్యాణ్ గౌడ్,వివిధ గ్రామాల సర్పంచ్ లు,లబ్ధిదారులు పాల్గొన్నారు.


