పేదల ఇండ్ల కూల్చివేత ఆపాలి
మోదీ ఇండ్లు కడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కులుస్తుంది
ముఖ్యమంత్రి తీరు మారకపోతే ప్రజలే గద్దె దింపుతారు
రైతు భరోసా పేరుతో రైతాంగాన్ని మోసం చేస్తున్నారు
రూ.27 వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలి
కాళేశ్వరం అవినీతిపై విచారణకు కేంద్రం సిద్దం
కేంద్ర హోం సహయ శాఖ మంత్రి బండి సంజయ్
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదలకు ఇండ్లు నిర్మిస్తుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్లను కూల్చడంలో పోటీ పడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. కరీంనగర్ నగరంలోని 51వ డివిజన్లో రూ.16 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నానా కష్టాలు పడి పేదలు నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద దేశవ్యాప్తంగా 4 కోట్ల ఇండ్లు నిర్మించామని మోదీ పేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కూల్చివేతలకే పరిమితమైందన్నారు. రేవంత్ రెడ్డి పనితీరు మారకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలే కూల్చివేస్తారని హెచ్చరించారు. వెంటనే ఇళ్ల కూల్చివేతలను నిలిపివేయాలని లేనిపక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.
రైతు భరోసా బకాయిలు వెంటనే చెల్లించాలి
రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా అమలు చేయకుండా రైతాంగాన్ని మోసం చేస్తోందని బండి సంజయ్ ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం రైతు భరోసా సొమ్ము జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 67 లక్షల మందికి పైగా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారని మూడు విడతల రైతు భరోసా కింద సుమారు రూ.27 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి అమలు చేయకపోవడం కాంగ్రెస్కు అలవాటైందని విమర్శించారు. రైతు భరోసా చెల్లించాలని కోరుతూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసినట్లు తెలిపారు. వెంటనే రైతు భరోసా సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, డీఏలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు వంటి హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. హామీలు అమలు కాకపోయినా ఓట్లు వస్తున్నాయనే అహంకారం కాంగ్రెస్ నేతల్లో పెరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు పైకి విభేదాలు చూపుతున్నా లోపల ఒక్కటేనని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గతంలో ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టే ధైర్యం చూపడం లేదని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కోరితే కేంద్రం విచారణ చేపట్టేందుకు సిద్ధమని తెలిపారు.
అభివృద్ధికి కేంద్రం కట్టుబాటు
కరీంనగర్ 51వ డివిజన్లో వర్షాకాలంలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు డ్రైనేజీ పనులు ప్రారంభించినట్లు బండి సంజయ్ తెలిపారు. కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి కరీంనగర్ను ఆదర్శంగా అభివృద్ధి చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులను కూడా ఒత్తిడి తెచ్చి సాధిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని అన్ని పార్టీల నాయకులు కలిసి కట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్ భండారి వేణు తదితరులు పాల్గొన్నారు.


