నీటి ఎద్దడి రావొద్దు
వేసవిలో తాగునీటి సరఫరా పటిష్టం
కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్
నీటి శుద్ధీకరణ కేంద్రం పరిశీలన
లీకేజీల మరమ్మతులు, సమ్మర్ యాక్షన్ ప్లాన్ ..
విలీన గ్రామాలపై ప్రత్యేక దృష్టి
కాకతీయ, కరీంనగర్ కార్పొరేషన్ : వేసవి కాలంలో నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. సోమవారం నగరంలోని మానేరు డ్యాం సమీపంలోని నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన సందర్శించి పంపుహౌజ్లు, మోటార్ పంపుల పనితీరు, నీటి శుద్ధీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా నీటి శుద్ధీకరణ కేంద్రంలో వాల్వ్ లీకేజీలు, మోటార్ పంపుల మరమ్మతులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. హై లెవల్ రిజర్వాయర్, సంప్, మోటార్ పంపులను తనిఖీ చేసి నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నగరంతో పాటు విలీన గ్రామాల ప్రజలకు ప్రతిరోజు త్రాగునీటి సరఫరా జరిగేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొత్తగా విలీనమైన గ్రామాల్లో త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపనున్నట్లు చెప్పారు.
రూ.49 లక్షల నిధులు
మానేరు డ్యాం నీటిమట్టం 7 టీఎంసీలకు చేరిన నేపథ్యంలో అదే స్థాయి నిల్వ కొనసాగించేలా ఇరిగేషన్ అధికారులకు సూచించినట్లు మేయర్ తెలిపారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం రూ.49 లక్షల నిధులు కేటాయించి టెండర్ ప్రక్రియ చేపట్టినట్లు వెల్లడించారు. అవసరాన్ని బట్టి విలీన గ్రామాలకు అద్దె బావులు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని తెలిపారు. అమృత్-2 పథకం ద్వారా పైపులైన్ పనులు కొనసాగుతున్నాయని, ఫిల్టర్ బెడ్లలో క్లోరినేషన్ ప్రక్రియ సక్రమంగా నిర్వహించి సురక్షిత నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ సమ్మర్ యాక్షన్ ప్రణాళిక అమలు విషయంలో అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మానేరు డ్యాంలో నీటిమట్టం తగ్గడంతో ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటి సరఫరా జరుగుతోందని, త్వరలో నాలుగు బూస్టర్ పంపులను ప్రారంభించి నీటి సరఫరాను మెరుగుపరుస్తామని తెలిపారు. వేసవి దృష్ట్యా ప్రజలు తాగునీటిని వృథా చేయకుండా వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మాసం గణేష్, డీఈ దేవేందర్, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.


