విధుల్లో నిర్లక్ష్యం తగదు
ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
25 మంది సర్వేయర్లకు లైసెన్స్ పత్రాల పంపిణీ
కాకతీయ, రాజన్న సిరిసిల్ల: లైసెన్సుడు సర్వేయర్లు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సోమవారం 25 మంది సర్వేయర్లకు లైసెన్స్ పత్రాలు ఇంచార్జి కలెక్టర్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ పూర్తి చేసుకొని పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన జిల్లాకు చెందిన 66 మంది సర్వేయర్లకు లైసెన్సులు గతంలో అందజేసిందని గుర్తు చేశారు. గత ఏడాది జిల్లాకు చెందిన సివిల్ విభాగంలో ఉత్తీర్ణత సాధించిన వారికి 50 రోజుల పాటు శిక్షణ ప్రభుత్వం అందించిందని, వారిలో శిక్షణ పూర్తి చేసుకొని పరీక్షలో పాస్ అయిన 25 మందికి లైసెన్స్ పత్రాలను అందించామని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు.లైసెన్స్ పొందిన వారు అందరూ వారికి కేటాయించిన మండలాల్లో అందుబాటులో ఉండాలని, ఉత్తమ సేవలు అందించాలని సూచించారు.


