మావోయిస్టు పార్టీకి భారీ షాక్..?
కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లా రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు?
కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం
లొంగుబాటా..? అరెస్టా..? స్పష్టత కోసం ఉత్కంఠ
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ మీసాల సత్తన్నతో పాటు మరో 25 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే వీరు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారా లేక పోలీసులు అరెస్ట్ చేసి లొంగుబాటుగా చూపిస్తున్నారా అన్న అంశంపై ఇంకా అధికారిక స్పష్టత వెలువడలేదు. తెలంగాణ–ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఇటీవల భారీ కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లలో భాగంగానే మల్లా రాజిరెడ్డి బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చర్యలో భాగంగా మావోయిస్టుల వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చాలనే లక్ష్యంతో మార్చి 31, 2026 వరకు గడువు విధించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ గడువు లోపు లొంగిపోయే మావోయిస్టులకు పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. అదే సమయంలో లొంగిపోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
లొంగుబాటుపై సందేహాలు.. ప్రజాసంఘాల ప్రశ్నలు
మల్లా రాజిరెడ్డి లొంగుబాటుపై ప్రజాసంఘాలు, హక్కుల సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు ముందుగా అరెస్ట్ చేసిన వ్యక్తులను తరువాత లొంగుబాటుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. నిజంగా స్వచ్ఛంద లొంగుబాటా లేదా పోలీసుల ఆపరేషన్ ఫలితమా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లా రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కీలక నేతగా కొనసాగుతున్నాడు. ఆయన అనేక సంవత్సరాలుగా అండర్గ్రౌండ్లో పనిచేస్తూ పార్టీ కార్యకలాపాలను నడిపించిన ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందాడు. గతంలో ఆయన మరణించాడన్న వార్తలు వచ్చినప్పటికీ పార్టీ వాటిని ఖండించింది. ప్రస్తుతం ఆయన లొంగుబాటు వార్తలు వెలువడడం మావోయిస్టు పార్టీలో పెద్ద పరిణామంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల కూడా పలువురు కీలక మావోయిస్టు నేతలు లొంగుబాటు కావడం లేదా భద్రతా బలగాల ఆపరేషన్లలో పట్టుబడటం గమనార్హం. దీంతో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు బలహీనపడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మల్లా రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటుపై పోలీసు శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే ఈ ఘటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పరిణామం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.


