కాంగ్రెస్ విశ్వాసాన్ని నిలబెట్టాలి
డీసీసీ అధ్యక్షులు బాధ్యతగా పని చేయాలి
దేశాభివృద్ధిలో కాంగ్రెస్ కీలక పాత్ర
పనితీరుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది
మెరిట్ ఉన్నవారికే భవిష్యత్లో అవకాశాలుంటాయి
కలిసికట్టుగా పనిచేస్తేనే పార్టీ బలోపేతం
పదవుల దుర్వినియోగానికి తావులేదు
డీసీసీ అధ్యక్షుల శిక్షణ తరగతుల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి
కాకతీయ,తెలంగాణ బ్యూరో : డీసీసీ అధ్యక్షులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. టీపీసీసీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణా తరగతుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, జిల్లాల స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో డీసీసీ అధ్యక్షుల పాత్ర కీలకమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టడం, పార్టీ సిద్ధాంతాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడం అధ్యక్షుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ఏఐసీసీ చేపట్టిన ఈ శిక్షణా కార్యక్రమం సమయోచితమైందని సీఎం పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, భారత రాజ్యాంగాన్ని దేశానికి అందించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఇచ్చిన స్వాతంత్ర్యం, రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని ఎదిగిన కొన్ని రాజకీయ పార్టీలు నేడు కాంగ్రెస్ ముక్త భారత్ అంటూ వ్యాఖ్యలు చేయడం చరిత్రను విస్మరించడమేనని విమర్శించారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కుట్రలు జరుగుతున్న ఈ సమయంలో కాంగ్రెస్ నాయకులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
త్యాగాల చరిత్ర కాంగ్రెస్ ప్రత్యేకత
కాంగ్రెస్ పార్టీ త్యాగాల పునాదిపై నిర్మితమైన పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి నేతలు దేశం కోసం తమ జీవితాలను అంకితం చేశారని గుర్తుచేశారు. మహాత్మా గాంధీ స్వాతంత్ర్యం కోసం అహింసా మార్గంలో పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. దేశ సమగ్రత కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు తమ ప్రాణాలను త్యాగం చేశారని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగించేందుకు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని, రాహుల్ గాంధీ కూడా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారని వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో పాదయాత్రలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర ప్రజల్లో కాంగ్రెస్పై విశ్వాసాన్ని పెంచిందని, ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ విజయాలకు పునాది వేశాయని గుర్తుచేశారు. అలాగే వైఎస్ షర్మిల కూడా వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారని చెప్పారు.
కలిసికట్టుగా పనిచేస్తేనే పార్టీ బలోపేతం
డీసీసీ అధ్యక్షులు తమను జిల్లాలకు అధిపతులుగా భావించకుండా కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాలని సీఎం సూచించారు. విభేదాలను అణచివేయడం కాకుండా సమన్వయంతో పనిచేయడం ద్వారా మాత్రమే పార్టీ బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. తాను పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి నాయకుడి ఇంటికి వెళ్లి మద్దతు కోరిన విషయాన్ని గుర్తుచేశారు. కలిసికట్టుగా పనిచేయడం వల్లే ఒకప్పుడు తక్కువ ఓట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ, నేడు ప్రజల విశ్వాసంతో అధికారంలోకి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి 119 నియోజకవర్గాల్లో 42 లక్షల డిజిటల్ సభ్యత్వాలు నమోదు చేయగలిగామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు ఎమ్మెల్యే అవకాశాలు, అనుబంధ విభాగాల్లో పనిచేసిన వారికి కార్పొరేషన్ పదవులు ఇచ్చినట్లు వెల్లడించారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి కాంగ్రెస్లో తగిన గుర్తింపు లభిస్తుందని స్పష్టం చేశారు.
పనితీరుపై నిరంతర పర్యవేక్షణ.. మెరిట్కే ప్రాధాన్యం
డీసీసీ అధ్యక్షుల పనితీరును నిరంతరం పరిశీలిస్తామని సీఎం స్పష్టం చేశారు. నియామకం జరిగిన ఆరు నెలల తర్వాత పనితీరును సమీక్షించి సంతృప్తికరంగా పని చేయని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి కోటాలు లేవని, మెరిట్ కోటా మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. పార్టీ పట్ల నిబద్ధత, ప్రజలతో అనుబంధం, కష్టపడే స్వభావం ఉన్న నాయకులకే అవకాశాలు ఉంటాయని స్పష్టం చేశారు. పదవులను వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగించకూడదని హెచ్చరించారు. డీసీసీ అధ్యక్ష పదవిని దుర్వినియోగం చేస్తే పార్టీ విశ్వాసాన్ని దెబ్బతీసినట్లవుతుందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే నాయకుల ప్రధాన లక్ష్యంగా ఉండాలని, పైరవీలు చేయకుండా పనిచేసే నాయకులకే ప్రజల్లో గౌరవం లభిస్తుందని తెలిపారు.
సామాజిక న్యాయం కాంగ్రెస్ లక్ష్యం
సామాజిక న్యాయం, సమానత్వం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో కులగణన నిర్వహించడం ద్వారా సామాజిక సమతుల్యత సాధించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని చెప్పారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 49.83 శాతం బీసీలు గెలవడం, మున్సిపల్ ఎన్నికల్లో 63 శాతం ఓబీసీలు విజయం సాధించడం కాంగ్రెస్ విధానాల ఫలితమని వివరించారు. బడుగు, బలహీన వర్గాలు, దళితులు, మైనార్టీల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత డీసీసీ అధ్యక్షులపై ఉందన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యం
డీసీసీ అధ్యక్షులు ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సీఎం సూచించారు. పార్టీ నాయకులు ప్రజల్లో విశ్వాసం పెంచే విధంగా పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని అన్నారు. పార్టీ విశ్వాసాన్ని నిలబెట్టడం ద్వారా మాత్రమే కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. దేశాన్ని, కాంగ్రెస్ పార్టీని విడదీయలేమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ ఆత్మగా నిలిచిందని, దేశ అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ పాత్ర కీలకమని అన్నారు. డీసీసీ అధ్యక్షులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.


