ప్రజా ప్రభుత్వానికి ప్రజల ఆమోద ముద్ర
◆ మున్సిపల్ ఫలితాలు ప్రజల విశ్వాసానికి నిదర్శనం
◆ సీఎం రేవంత్ నాయకత్వానికి ప్రజల మద్దతు
◆ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకే విజయ ఫలితం
◆ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం : మంత్రి దుద్దిళ్ల
కాకతీయ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చిన ఆమోద ముద్ర అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనమని తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి ఈ మేరకు స్పందించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకే ఈ విజయాలు ప్రతిఫలమని మంత్రి పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.
ప్రజల విశ్వాసమే కాంగ్రెస్ బలం
స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయాలని ప్రయత్నించిన శక్తులకు ఈ ప్రజా తీర్పు గట్టి సమాధానమని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అదే ప్రజల మద్దతుకు కారణమైందన్నారు. ఈ విజయంతో ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మార్గనిర్దేశనంలో, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచేలా ప్రభుత్వం పారదర్శక పాలన అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.


