ధర్మపురిలో కాంగ్రెస్ అఖండ విజయం
15కు 15 వార్డులు కైవసం
విపక్షాలకు తలెత్తే స్థలం లేకుండా ప్రజా తీర్పు
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అపూర్వ విజయాన్ని నమోదు చేసి పట్టణ రాజకీయాల్లో తన అప్రతిహత శక్తిని చాటుకుంది. మొత్తం 15 వార్డులకు జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకుని మున్సిపాలిటీపై సంపూర్ణ ఆధిపత్యాన్ని స్థాపించింది. ఒక్క వార్డు కూడా ప్రత్యర్థి పార్టీలకు దక్కకపోవడం రాజకీయంగా సంచలన పరిణామంగా మారింది. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బలపరిచిన అభ్యర్థులందరూ ఘన విజయం సాధించడం ఈ ఎన్నికల ప్రధాన విశేషంగా నిలిచింది. మంత్రి నాయకత్వంపై ప్రజల విశ్వాసం స్పష్టంగా వ్యక్తమైనట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలకు ఏ మాత్రం అవకాశమివ్వకుండా ఓటర్లు కాంగ్రెస్కు ఏకపక్ష మద్దతు ఇవ్వడం స్థానిక రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణుల సమన్వయం, దూకుడు ప్రచారం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల విశ్వాసం ఫలితాల్లో ప్రతిఫలించినట్లు పరిశీలకులు పేర్కొంటున్నారు. ఈ ఫలితాలతో ధర్మపురి మున్సిపల్ పాలన పూర్తిగా కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్లగా పట్టణ రాజకీయాల్లో పార్టీ ప్రభావం మరింత బలపడినట్లు స్పష్టమైంది. విపక్షాలకు ఇది భారీ రాజకీయ ఎదురుదెబ్బగా మారగా భవిష్యత్ ఎన్నికల సమీకరణాలపై ఈ ఫలితాలు ప్రభావం చూపే అవకాశముందని చర్చ సాగుతోంది.
వార్డుల వారీగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు
1వ వార్డు – అయ్యోరి వేణుగోపాల్
2వ వార్డు – సంగనభట్ల సంతోషి
3వ వార్డు – ఇంధారపు రామయ్య
4వ వార్డు – కొమిరెళ్లి పవన్ కుమార్
5వ వార్డు – వేముల నాగలక్ష్మి
6వ వార్డు – ముదుసుల ప్రశాంత్
7వ వార్డు – వంకుడోత్ విజయ్ బాబు
8వ వార్డు – జంజిరిజాని సువర్ణ
9వ వార్డు – వీరవేణి నాగలక్ష్మి
10వ వార్డు – ఆనంద్ సంగి
11వ వార్డు – జక్కు పద్మ
12వ వార్డు – చుక్క సంధ్య
13వ వార్డు – చిపిరిశెట్టి రాజేష్
14వ వార్డు – వేముల రామాదేవి
15వ వార్డు – వొజ్జాల లక్ష్మణ్


