పోలింగ్కు సర్వం సిద్ధం!
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్
వెబ్కాస్టింగ్తో పూర్తి నిఘా.. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
18 రకాల గుర్తింపు కార్డులతో ఓటు వేసే అవకాశం
13న ఓట్ల లెక్కింపు
కాకతీయ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లేటప్పుడు ఎన్నికల సంఘం ఆమోదించిన 18 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి తీసుకురావాలని అధికారులు సూచించారు. వీటిలో ఓటర్ ఐడీ, ఆధార్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ప్రభుత్వ ఉద్యోగ గుర్తింపు కార్డు తదితరాలు ఉన్నాయి.
జనగామ–స్టేషన్ ఘన్పూర్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
జనగామ జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జనగామ మున్సిపాలిటీలో 30 వార్డులకు 66 పోలింగ్ కేంద్రాలు, స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 18 వార్డులకు 36 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ రెండు మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం 62,595 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. జనగామలో 44,045 మంది, స్టేషన్ ఘన్పూర్లో 18,550 మంది ఓటర్లు ఉన్నారు. పోలింగ్ విధుల కోసం ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, మైక్రో అబ్జర్వర్లను నియమించారు. అన్ని కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఎన్నికల నిబంధనల అమలుకు ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసీసీ బృందాలు పనిచేస్తుండగా, సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భూపాలపల్లి–ములుగులో ప్రత్యేక భద్రత
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 30 వార్డులకు 86 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 52,726 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణకు 10 మంది రిటర్నింగ్ అధికారులు, 104 మంది ప్రిసైడింగ్ అధికారులు, 104 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 312 మంది ఇతర సిబ్బందిని నియమించారు. 19 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా, 23 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించి అదనపు బలగాలను మోహరించారు. ములుగు మున్సిపాలిటీలో 20 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 13,500 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. సమస్యాత్మక కేంద్రాల్లో పూర్తి స్థాయి వెబ్కాస్టింగ్తో నిఘా కొనసాగుతోంది.
మహబూబాబాద్ జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు
మహబూబాబాద్ జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో 98 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 193 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, 1.27 లక్షల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. సైలెన్స్ పీరియడ్ అమలులో ఉండటంతో బహిరంగ సభలు, ర్యాలీలపై నిషేధం విధించారు. మద్యం దుకాణాలు మూసివేసి, సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నారు.
వరంగల్–హన్మకొండ జిల్లాల్లో పోలింగ్ ఏర్పాట్లు
వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 100 శాతం వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సుమారు 1,200 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. హన్మకొండ జిల్లాలో పరకాల మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. పరకాలలో పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ సిబ్బందికి మూడు విడతల శిక్షణ పూర్తి చేసి ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయించారు.
పోలీస్ బందోబస్తు పెంపు
మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. జనగామ, ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, నర్సంపేట మున్సిపాలిటీల్లో 1,100 మందికిపైగా పోలీసులను నియమించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, 200 మీటర్ల పరిధిలో గుంపులు గుమిగూడకుండా చర్యలు తీసుకున్నారు. మొబైల్ పెట్రోలింగ్ బృందాలు నిరంతర నిఘా కొనసాగిస్తాయని తెలిపారు


