కాంగ్రెస్ హత్య రాజకీయాలకు పాల్పడుతోంది
మంత్రి వాకాటి శ్రీహరిని వెంటనే బర్తరఫ్ చేయాలి
ఎన్నికల కమిషన్ తక్షణ చర్యలు తీసుకోవాలి
మహదేవ్ మృతి ముమ్మాటికీ కాంగ్రెస్ హత్యే
బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ధ్వజం
కాకతీయ, వరంగల్ సిటీ : కాంగ్రెస్ పార్టీ హత్య రాజకీయాలకు పాల్పడుతోందని, వెంటనే మంత్రి వాకాటి శ్రీహరిని పదవి నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషన్ వెంటనే స్పందించి కాంగ్రెస్ పార్టీపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఎరుకల మహదేవ్ కాంగ్రెస్ నేతల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తూ మంగళవారం శంభునిపేట జంక్షన్లో బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
కాంగ్రెస్ వేధింపులే కారణం
ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ, మహదేవ్ నామినేషన్ వేసినప్పటి నుంచే కాంగ్రెస్ నాయకులు అతనిపై ఒత్తిడి పెంచారని ఆరోపించారు. విజయం ఖాయమని తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు బెదిరింపులు, వేధింపులకు పాల్పడ్డారని, అవే మహదేవ్ ఆత్మహత్యకు దారి తీశాయని తెలిపారు. సోమవారం ప్రచారం ముగిసిన తర్వాత ఇంట్లో ఉరి వేసుకుని మహదేవ్ మృతి చెందడం వెనుక కాంగ్రెస్ కుట్రే ఉందని మండిపడ్డారు.
దేశవ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్ భయపడుతోందని, అందుకే ఇలాంటి దారుణాలకు దిగుతోందని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడతారని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గడల కుమార్, కందిమల్ల మహేష్, బైరి నాగరాజు, జిల్లా కార్యదర్శి గోకే వెంకటేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఎర్రగొల్ల భరత్ వీర్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


