ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది!
ఎక్కడెక్కడ పరికరాలు పెట్టారో ఆరా తీస్తున్నాం
బాధ్యులపై ఉక్కుపాదం తప్పదు
మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
పుర పోరులో కాంగ్రెస్ ప్రభంజనం ఖాయం
80 శాతానికి పైగా స్థానాలు గెలుస్తాం
ప్రతిపక్షాల విమర్శలు ఆక్రోశమే
కాకతీయ, ఖమ్మం బ్యూరో : రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పటికీ కొనసాగుతోందని, దీనిపై ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరుపుతోందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో జరిగిన ట్యాపింగ్తో పాటు ప్రస్తుతం కూడా ఈ అక్రమాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. బాధ్యులెవరైనా సరే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మంగళవారం ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ప్రభుత్వానికి పక్కా సమాచారం ఉందన్నారు. “ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు వాస్తవమే. ఇప్పటికీ కొందరు ఇదే తంతును కొనసాగిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎక్విప్మెంట్ పెట్టారు? ఎవరు సూత్రధారులు? అన్నదానిపై ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైంది. నిజాలు బయటపెట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.
విచారణ కొనసాగుతోంది
ట్యాపింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుందని, ఎక్కడా ఉపేక్షించబోమని మంత్రి తేల్చిచెప్పారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా విచారణ సాగుతోందని పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అక్రమాలకు పాల్పడిన వారు ఎంత పెద్దవారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇక ఉద్యోగులను ఓట్లు అడగడంపై వచ్చిన ప్రశ్నకు సమాధానంగా, “నేను పార్టీ నేతగా ఓట్లు అడిగాను. అందులో తప్పేముంది” అంటూ మంత్రి సమర్థించుకున్నారు.
బుధవారం జరగనున్న రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించబోతోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. గత రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని, అందుకే ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు. “ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 80 శాతానికి పైగా స్థానాలను కైవసం చేసుకోవడం ఖాయం. ప్రతిపక్షాలకు ప్రజల్లో ఆదరణ లేదు. అందుకే అసహనంతో విమర్శలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు చేసిన హడావుడిని ప్రజలు తిప్పికొట్టారు. అదే తీర్పు రేపటి ఎన్నికల్లోనూ పునరావృతం కానుంది” అని పొంగులేటి వ్యాఖ్యానించారు.
అప్పుల తెలంగాణను గాడిలో పెట్టాం
గత ప్రభుత్వ పాలనపై మంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే సమయానికి తెలంగాణను రూ.8.19 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేశారని ఆరోపించారు. నెలకు రూ.6,300 కోట్ల మేర అప్పుల భారాన్ని చెల్లిస్తున్నప్పటికీ, సంక్షేమాన్ని ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. “గత దొరల పాలనలో పేదలను పూర్తిగా విస్మరించారు. 62 వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మొండిగోడలుగా మిగిలిపోయాయి. కానీ మా ప్రభుత్వం 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. ‘వరి వేస్తే ఉరి’ అన్న పరిస్థితిని మార్చి, రైతులకు వడ్లకు బోనస్ ఇస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం” అని మంత్రి వివరించారు. ప్రతిపక్ష నేతలు అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని, ప్రజలు ఓటు ద్వారానే వారికి తగిన గుణపాఠం చెబుతారని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు.


