మద్యం దుకాణాలు క్లోజ్
ప్రచార హోరుకు బ్రేక్ – 48 గంటల సైలెన్స్ పీరియడ్
వర్ధన్నపేట, నర్సంపేటలో ఈ నెల 11న సెలవు
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ జిల్లాలో కీలక ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు. వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపాలిటీల్లో పోలింగ్ జరగనున్న ఫిబ్రవరి 11న స్థానిక సెలవు ప్రకటించారు. ఆ రోజు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని, ప్రైవేట్ సంస్థలు కూడా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించారు. పోలింగ్ నిర్వహణకు వినియోగించే విద్యాసంస్థలకు 10, 11, 13 తేదీల్లో సెలవులు ప్రకటించారు. ఫిబ్రవరి 9 సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారంపై నిషేధం అమలులోకి వస్తుందని, 48 గంటల సైలెన్స్ పీరియడ్లో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు అనుమతించబోమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ దృష్ట్యా సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి 11 వరకు మద్యం, కల్లు దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు జరిగే 13న కూడా డ్రై డే అమల్లో ఉంటుందని తెలిపారు. ఓటర్లు బాధ్యతగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.


