అవినీతి చేతికి పట్టణం ఇస్తే అధోగతి
కాంగ్రెస్కు అధికారం ఇస్తే అభివృద్ధి ఖాయం
ధర్మపురిలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపు
కాకతీయ, జగిత్యాల : ధర్మపురి మున్సిపల్ ఎన్నికల్లో అవినీతిమయ రాజకీయాలకు చెక్ పెట్టాలని, కాంగ్రెస్కు అధికారం ఇస్తే పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం ప్రచార చివరి రోజున ఆయన ఆధ్వర్యంలో ధర్మపురిలో భారీ ర్యాలీ నిర్వహించారు. పటేల్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీ చౌక్, నంది చౌరస్తా, అంబేద్కర్ జంక్షన్ మీదుగా ఎస్హెచ్ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ పాలనలో ధర్మపురి అభివృద్ధి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో పట్టణంతో పాటు శ్రీలక్ష్మీ నర్సింహస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.


