‘100 కోట్ల ఒప్పందం’ ఆరోపణలపై కాంగ్రెస్ ఫిర్యాదు
విచారణ జరిపి నిజాలు తేల్చాలని పోలీసులకు వినతి
నిరాధారమైతే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
కాకతీయ, కరీంనగర్ : కాంగ్రెస్, ఎంఐఎం పార్టీల మధ్య రూ.100 కోట్ల ఒప్పందం కుదిరిందంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకత్వం తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొంటూ సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్ తదితరులు కలిసి కరీంనగర్ 1వ ఠాణా సీఐకు ఫిర్యాదు అందజేశారు. ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులెవరో తేల్చాలని వారు డిమాండ్ చేశారు.విచారణలో ఆరోపణలు అసత్యమని తేలితే, వ్యాఖ్యలు చేసిన వారు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా రాజకీయ లబ్ధి కోసం తప్పుడు ప్రచారం చేయడం తగదని విమర్శించారు. ఈ వ్యవహారం కరీంనగర్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.


