జాతిపిత కేసీఆర్ – బూతుల పిత రేవంత్!
త్యాగాలతో తెలంగాణ తెచ్చిన మహనీయుడు కేసీఆర్
రెండు రైతుబంధులు ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రభుత్వానికి నిబద్ధత ఉంటే రైతుబంధు వెంటనే జమ చేయాలి
బూటకపు హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది
పెన్షన్లు, మహిళా భృతి అమలు కావడం లేదు
బీజేపీ నేతలకు అక్షింతలు పంచడం తప్ప అభివృద్ధి గురించి తెల్వదు
గజ్వేల్ రూపురేఖలు మార్చిన ఘనత పూర్తిగా కేసీఆర్దే
తెలంగాణను కాపాడుకోవాలంటే కారు గుర్తుకే ఓటు
కాంగ్రెస్ వైఫల్యాలపై మాజీ మంత్రి తీవ్ర విమర్శలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రాన్ని త్యాగాలతో, ఆమరణ దీక్షతో సాధించిన మహనీయుడు కేసీఆర్ అని, ముమ్మాటికీ ఆయన తెలంగాణ జాతిపిత అని మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా వ్యాఖ్యానించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బూతుల పితగా అభివర్ణిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ అభివృద్ధి ప్రధాత కేసీఆర్ అయితే, బూతుల ప్రధాత రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఎరువు బస్తాలు ఇవ్వడం చేతకాని, పండిన వడ్లు కొనలేని చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు. ఇప్పటికే రెండు రైతుబంధు విడతలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని, ఇది మూడో విడత అని, మొత్తం కలిపి ఒక్కసారే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ అడ్డురాదని, అవసరమైతే తామే ఎన్నికల కమిషన్కు లేఖ ఇస్తామని, దమ్ముంటే ఈ నెల 11లోగా రైతుబంధు వేయాలని సవాల్ విసిరారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీని రైతులు చీల్చి చెండాడతారని హెచ్చరించారు. సద్ది తిన్న రేవు తలవాలన్న నానుడిని గుర్తుచేస్తూ, మనకు అన్నం పెట్టిన కేసీఆర్ గారికి అండగా నిలవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్లో భారీ రోడ్ షోలో పాల్గొన్న హరీష్ రావు, కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించారు. గజ్వేల్లో ఎన్నికలు వచ్చాయని, మనకు పని చేసిన నాయకులకే ఓటేయాలని సూచించారు. కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎలా ఉండేదో, ఇప్పుడు ఎలా మారిందో ప్రజలు ఆలోచించాలన్నారు. అప్పట్లో పాడుబడిన ఆసుపత్రి పరిస్థితి నుంచి, నేడు 250 పడకల ఆసుపత్రి స్థాయికి తీసుకొచ్చి పేదలకు కార్పొరేట్ వైద్యం అందించిన ఘనత కేసీఆర్దేనని తెలిపారు. ఆర్డీవో కార్యాలయం, రైలు సదుపాయం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, చెరువుల సుందరీకరణ వంటి ఎన్నో అభివృద్ధి పనులు కేసీఆర్ నేతృత్వంలోనే జరిగాయని స్పష్టం చేశారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా పేదింటి ఆడబిడ్డలకు లక్షా వెయ్యి నూట పదహారు రూపాయలు అందించి మేనమామలా ఆదుకున్నది కేసీఆర్ అని గుర్తు చేశారు.
గజ్వేల్ రూపు మార్చిన నాయకుడు కేసీఆర్
గజ్వేల్లో మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు, బీసీ, ఎస్సీ, మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసి చదువుల విప్లవం తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని హరీష్ రావు వివరించారు. ఒకప్పుడు మూడు రోజులకోసారి నీళ్లు వచ్చే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ప్రతి ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందించిన ఘనత కేసీఆర్దేనన్నారు. మహిళల బిందెల కష్టాలు తీర్చిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. కరోనా కష్టకాలంలోనూ కేసీఆర్ రైతుబంధును ఒక్కసారి కూడా ఆపలేదని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక వరుసగా రెండు విడతలు ఎగ్గొట్టిందని ఆరోపించారు. ఇప్పుడు రావాల్సిన మూడో విడతతో కలిపి మొత్తం మూడు రైతుబంధు సొమ్మును వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ హామీలు అన్నీ మోసమే
రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారని హరీష్ రావు మండిపడ్డారు. పెన్షన్లు రూ.4 వేలు చేస్తామని చెప్పి రూపాయి కూడా పెంచలేదని, ఇప్పటివరకు ఒక్కో అవ్వాతాతకు రూ.52 వేల బాకీ ప్రభుత్వం పడిందన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పి ఎవరికి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ఫ్రీ బస్సు పేరుతో మహిళలను ఇబ్బందులు పెట్టి, మగవాళ్లకు డబుల్ టికెట్ భారమేశారని విమర్శించారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లి వచ్చానని చెప్పుకునే రేవంత్ రెడ్డి బుద్ధి కుక్కతోక వంకరేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీపైనా హరీష్ విమర్శల వర్షం
పువ్వు గుర్తు వాళ్లు ఎన్నడైనా ఒక్క రూపాయి పని చేశారా? అక్షింతలు పంచడం తప్ప ప్రజలకు ఏం చేశారని బీజేపీపై కూడా హరీష్ రావు విమర్శలు గుప్పించారు. యాదాద్రి నరసింహస్వామి ఆలయం, గజ్వేల్ వెంకటేశ్వర స్వామి ఆలయం, రామాలయం, శివాలయాలను అద్భుతంగా అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. మైనార్టీ పిల్లల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్, షాదీ ముబారక్ వంటి పథకాలు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్దేనని తెలిపారు. రేవంత్ రెడ్డి వచ్చాక మైనార్టీల కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, చేపల పెంపకం, దళితబంధు వంటి పథకాలను రద్దు చేసి రాష్ట్రాన్ని ఆగం చేశారని ఆరోపించారు. తెలంగాణను కాపాడుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఇప్పుడు గెలిచే కౌన్సిలర్లు ఐదేళ్లు ఉంటారని, రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజ్ఞాపూర్ గౌరవం నిలబడాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


