కరీంనగర్లో కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందే
సీఎం సభ విజయవంతం చేయాలి
కార్పొరేటర్ అభ్యర్థులతో మంత్రి తుమ్మల కీలక సమావేశం
ప్రతి డివిజన్ నుంచి భారీగా జనసమీకరణకు పిలుపు
అభ్యర్థుల ఎంపిక నిబద్ధత ఆధారంగానే జరిగిందని స్పష్టం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందేనని జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎన్నికల పోరులో పార్టీ అభ్యర్థులందరూ సమన్వయంతో పనిచేయాలని, ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయడమే గెలుపుకు పునాది అవుతుందని అన్నారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ అంజన్ కుమార్ అధ్యక్షతన కార్పొరేటర్ అభ్యర్థులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొని ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు.
సీఎం సభే కీలక మలుపు
మానకొండూర్ ఎమ్మెల్యే, పీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, చొప్పదండి గుమలాపూర్లో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను ప్రతి ఒక్కరూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని సూచించారు. ఎన్నికలకు మిగిలిన కొద్ది రోజులు అభ్యర్థులు మరింత ఉత్సాహంగా ప్రచారం నిర్వహించాలని, ఈ సభే కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మార్గం వేస్తుందని అన్నారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు ప్రజల కోసమే పనిచేస్తున్నారని తెలిపారు. సుడా పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని, అవసరమైతే డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కరీంనగర్ అసెంబ్లీ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ, సీఎం సభకు ప్రతి డివిజన్ నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలను తరలించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. డాక్టర్ అంజన్ కుమార్ మాట్లాడుతూ, సీఎం సభ తర్వాత ఓటర్లలో కాంగ్రెస్ పట్ల మరింత అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, పార్టీ విజయావకాశాలు స్పష్టంగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక పూర్తిగా నిబద్ధత, సేవా తత్పరత ఆధారంగానే జరిగిందని స్పష్టం చేశారు. ఎలాంటి పైరవీలు, ఆర్థిక లావాదేవీలకు తావులేకుండా అభ్యర్థులను ఎంపిక చేశామని తెలిపారు. పార్టీ కోసం శ్రమించిన వారికి భవిష్యత్తులో నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ప్రతి డివిజన్లో విస్తృత ప్రచారం
ప్రతి అభ్యర్థి తన డివిజన్లో ప్రతి ఓటరును నేరుగా కలవాలని, ఇంటింటి ప్రచారం మరింత వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి సభకు ప్రతి డివిజన్ నుంచి కనీసం 500 మందిని తరలించాలని ఆదేశించారు. రేపటి సభ విజయవంతమైతే కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని తుమ్మల ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, మాజీ హౌస్ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, పార్టీ నాయకులు, కార్పొరేటర్ అభ్యర్థులు పాల్గొన్నారు.


