కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి
పని చేసే వారికి పట్టం కట్టండి
హుస్నాబాద్ అభివృద్ధి బాధ్యత నాదే
20 సీట్లు ఇస్తే మరింత ఉత్సాహంగా పనిచేస్తాం
మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
కాకతీయ, హుస్నాబాద్ : మున్సిపల్ ఎన్నికల్లో హుస్నాబాద్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని వైశ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 20 మంది కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేశారని తెలిపారు. పట్టణంలో గత రెండేళ్లుగా చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలు గుర్తించి, కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు గెలిపిస్తే మరింత ఉత్సాహంతో పని చేస్తామని పేర్కొన్నారు.
అభివృద్ధే ప్రధాన అజెండా
విద్య, వైద్యం, ఉపాధి రంగాలను మెరుగుపర్చేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని మంత్రి వివరించారు. హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, 250 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుతో పాటు పట్టణంలో ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు.
ఎల్లమ్మ చెరువు కాలువల అభివృద్ధికి రూ.2.70 కోట్లు, కొత్త చెరువు మత్తడి కాలువల అభివృద్ధికి రూ.8.5 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పల్లె చెరువు అభివృద్ధి, ఆర్టీఏ కార్యాలయ నిర్మాణ టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. స్విమ్మింగ్ పూల్ నిర్మాణం ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయిందని, రూ.2 కోట్లతో మోడల్ స్కూల్ పక్కన చిల్డ్రన్ పార్క్ అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
ఆధునిక సదుపాయాలు
దేవతల బావి, వెజిటేబుల్ మార్కెట్ సమీపంలో షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మిస్తున్నామని, అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భైరవస్వామి గుడి, మహాసముద్రం గండి ప్రాంతాలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ తరహాలో హుస్నాబాద్లోనూ ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్లు తీసుకువస్తామని, విద్యా సంస్థల ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేస్తున్నామని మంత్రి వివరించారు.
మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సెట్విన్ ద్వారా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పట్టణంలో క్రీడా విగ్రహాలు, యోగా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు.
మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
ఇటీవల భారీ వర్షాలతో ఏర్పడిన నీటి సమస్యను దృష్టిలో పెట్టుకుని రూ.8 కోట్లతో మార్కెట్ యార్డు నుంచి నీటి తరలింపుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. భవిష్యత్తులో పట్టణంలో ముంపు సమస్య లేకుండా శాశ్వత చర్యలు తీసుకున్నామని చెప్పారు.
పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్ రూం కూడా ఇవ్వని గత ప్రభుత్వానికి భిన్నంగా, కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణంలోనే 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని, కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని, సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.
అసంతృప్తి లేదు
పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎలాంటి అసంతృప్తి లేదని, నామినేషన్లు వేసిన వారు కూడా ఉపసంహరించుకున్నారని మంత్రి స్పష్టం చేశారు. హుస్నాబాద్–అక్కన్నపేట–రామవరం రోడ్ల అభివృద్ధి, కోహెడలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. హుస్నాబాద్ పట్టణానికి రింగ్ రోడ్డు, ఎల్లమ్మ చెరువు ద్వారా తాగునీటి సరఫరా, మార్కెట్ అభివృద్ధి వంటి అనేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని చెప్పారు. కోతుల వల్ల రైతులకు కలుగుతున్న ఇబ్బందులను కూడా పరిష్కరిస్తామని తెలిపారు.
గతంలో బలవంతంగా ఈ ప్రాంతాన్ని సిద్దిపేట జిల్లాలో కలిపారని, అయినప్పటికీ హుస్నాబాద్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత ఉత్సాహంగా పని చేస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


