వన దేవతలకు గవర్నర్ దంపతుల మొక్కులు
మేడారంలో జిష్ణుదేవ్కు ఘన స్వాగతం
సమ్మక్క-సారలమ్మకు ప్రత్యేక పూజలు.. ఎత్తు బంగారం
జాతర ఏర్పాట్లపై అధికారులతో చర్చలు
భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచన
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మేడారం వన దేవతలను దర్శించుకున్నారు. శుక్రవారం సమ్మక్క–సారలమ్మను సతీసమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తులాభారం నిర్వహించి, అమ్మవార్లకి బంగారం సమర్పించారు. ముందుగా గవర్నర్కు మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ ఘనంగా స్వాగతం పలికారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు పటిష్టమైన భద్రత, వసతి ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ జాతరకు సంబంధించిన ఏర్పాట్లు, గిరిజన సాంప్రదాయాల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… తెలంగాణ ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్ధి కోసం వన దేవతల ఆశీస్సులు కోరుకున్నట్లు తెలిపారు. రాష్ట్రం శాంతి, సమృద్ధితో ముందుకు సాగాలని ప్రార్థించినట్లు చెప్పారు. మేడారం జాతర తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ మహాజాతర ద్వారా ఐక్యత, విశ్వాసం పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. వనదేవతల కృపతో ప్రజల జీవితం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గవర్నర్ వెంట పలువురు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భక్తుల భద్రత, సౌకర్యాలపై అధికారులతో గవర్నర్ చర్చించారు.


