స్థానిక సమరానికి మేం సిద్ధం
బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యం
కార్పొరేషన్–మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో పోటీ
ఆర్ఎల్డీ జిల్లా అధ్యక్షుడు కట్ట సతీష్
కాకతీయ, కొత్తగూడెం రూరల్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బహుజనుల రాజ్యాధికార సాధనే లక్ష్యంగా భవిష్యత్తు పోరాటాలకు సిద్ధంగా ఉన్నామని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కట్ట సతీష్ అన్నారు. కొత్తగూడెంలోని నందా తండాలో నూతన జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే కొత్తగూడెం కార్పొరేషన్తో పాటు ఇల్లందు, అశ్వరావుపేట మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీట్లు కేటాయించి అన్ని స్థానాల్లో బహుజన అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ ముందుకు వచ్చిందన్నారు. అణగారిన వర్గాల ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి ఐకమత్యంతో బడుగు–బలహీన వర్గాల నాయకులను కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా గెలిపించుకుంటేనే నిజమైన రాజ్యాధికారం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. బహుజన సిద్ధాంతంతోనే పోరాటం చేస్తే సమాజంలో సమానత్వం సాధ్యమవుతుందని కట్ట సతీష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మూడ్ వీరన్న, యూత్ ప్రెసిడెంట్ గుగులోత్ పృథ్వి, సోషల్ మీడియా ఇంచార్జి కాకటి శ్రీకాంత్, మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ కప్పల విజయ్ తదితరులు పాల్గొన్నారు


