28న ముంజంపల్లికి కాంగ్రెస్ అగ్రనేతలు
మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాక
ఉపాధి హామీ కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం
కాకతీయ, కరీంనగర్ : కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్ ఈ నెల 28న కరీంనగర్ జిల్లాకు రానున్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుమార్పు, నిధుల కోత విధింపును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామంలో ఉపాధి కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో వారు పాల్గొననున్నారు.ఈ విషయాన్ని టీపీసీసీ ఎస్సీ విభాగం చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకుని, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ *సత్తు మల్లేష్*తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి మానకొండూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని డాక్టర్ కవ్వంపల్లి పిలుపునిచ్చారు.


