పారదర్శకంగా మున్సిపల్ ఎన్నికలు
నోటిఫికేషన్ నుంచే ప్రవర్తన నియమావళి అమలు చేయాలి
పోలింగ్–కౌంటింగ్ వరకూ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ చేపట్టాలి
ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత ఓటింగ్ లక్ష్యం
జిల్లా అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సమీక్ష
ఎన్నికల యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ఎన్నికల యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. హైదరాబాద్ నుంచి మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి తదితర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటినుంచే ప్రవర్తన నియమావళి కఠినంగా అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సామాగ్రి పంపిణీ–స్వీకరణ, స్ట్రాంగ్రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల నిర్వహణ వరకు ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. జోనల్, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, పిఓలు, ఎపిఓలు, ఎన్నికల సిబ్బంది నియామకంలో పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

భద్రత, వెబ్కాస్టింగ్ కీలకం
పోలింగ్ కేంద్రాలు, నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పకడ్బందీ పోలీసు బందోబస్తు ఉండాలన్నారు. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రి, బ్యాలెట్ ప్రింటింగ్కు అవసరమైన ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని తెలిపారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా పాటించేలా పర్యవేక్షణ బృందాలు పనిచేయాలని సూచించారు. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సాగాలన్నారు. పారదర్శకతే లక్ష్యంగా ప్రతి దశలో పర్యవేక్షణ ఉండాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లాలో పూర్తి సిద్ధం
వీడియో కాన్ఫరెన్స్కు హాజరైన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ, జిల్లాలోని ఏదులాపురం, కల్లూరు, మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీల పరిధిలోని 117 వార్డులకు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. వెబ్కాస్టింగ్, నోడల్–జోనల్ అధికారులు, రిటర్నింగ్–సహాయ రిటర్నింగ్ అధికారులు, పిఓలు–ఓపిఓల నియామకం, శిక్షణ, ఎన్నికల సామాగ్రి పంపిణీ–స్వీకరణ, స్ట్రాంగ్రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ సమీక్షలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, డీఆర్డీవో సన్యాసయ్య, తదితర అధికారులు పాల్గొన్నారు.


