సింగరేణి భవిష్యత్తు కోసం నడుం బిగిద్దాం!
పోటీ మార్కెట్లో నిలవాలంటే ధర–నాణ్యతే కీలకం
నష్టాల నుంచి బయటపడ్డ చరిత్ర మన బలం
సమష్టి శ్రమతోనే సంస్థకు రక్షణ
రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి
సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భాస్క
కాకతీయ, కొత్తగూడెం : బొగ్గును అమ్ముకోగలిగితేనే సింగరేణి కాలరీస్ కంపెనీని నడిపించగలమని, కంపెనీ ముందుకు సాగితేనే కార్మికులు–ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించగలమని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ భాస్కర్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. బొగ్గు విక్రయంలో మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ధర తగ్గించడంతో పాటు నాణ్యత ప్రమాణాలను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇవే ప్రస్తుతం సింగరేణి ముందు నిలిచిన అతిపెద్ద సవాళ్లని పేర్కొన్నారు. ఈ సవాళ్లను అధిగమించాలంటే అధికారి నుంచి కార్మికుడి వరకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. వినియోగదారుల విశ్వాసం పొందినప్పుడే కంపెనీకి స్థిరమైన భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.

నష్టాల నుంచి నిలబడ్డ సింగరేణి
దేశంలో అనేక ప్రభుత్వ సంస్థలు ఒడిదుడుకులను ఎదుర్కొని మూతపడ్డాయని, అయితే సింగరేణి మాత్రం వాటిని తట్టుకుని నిలబడిందని కృష్ణ భాస్కర్ గుర్తుచేశారు. పంతొమ్మిదివందల తొంభై దశకంలో తీవ్ర నష్టాలతో రెండు సార్లు బి.ఐ.ఎఫ్.ఆర్కు వెళ్లిన సందర్భాల్లోనూ కార్మికులు, అధికారులు, కార్మిక సంఘాలు సమిష్టిగా కృషి చేసి కంపెనీని కాపాడుకున్నారని తెలిపారు. ఆ చరిత్రే నేడు మన బలమని చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్యంతో బొగ్గు మార్కెట్ కొనసాగిందని, కానీ ప్రస్తుతం ప్రైవేటు సంస్థలతో కూడిన తీవ్ర పోటీ పరిస్థితులు ఏర్పడ్డాయని వివరించారు. మారిన ప్రభుత్వ విధానాల నేపథ్యంలో సింగరేణి కూడా పోటీ మార్కెట్లో నిలవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
ధర తగ్గితేనే డిమాండ్… నాణ్యతే ఆధారం
విద్యుత్ సంస్థలు ఇకపై తమకు నచ్చిన చోట నాణ్యమైన బొగ్గును కొనుగోలు చేసే స్వేచ్ఛ కలిగి ఉన్నాయని చెప్పారు. గతంలా ‘మన దగ్గరే కొనాలి’ అనే అనుబంధం లేదా నిబంధన ఇక ఉండదన్నారు. నాణ్యమైన బొగ్గును తక్కువ ధరకు అమ్మినప్పుడే మార్కెట్లో నిలబడగలమని స్పష్టం చేశారు. అయితే సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి ఖర్చు ఇతర సంస్థలతో పోలిస్తే ఎక్కువగా ఉందని, దీన్ని తగ్గించుకోవడం అత్యవసరమని అన్నారు. ఉత్పత్తి ఖర్చు తగ్గితేనే తక్కువ ధరకు బొగ్గు విక్రయించగలమని, అప్పుడు మాత్రమే వినియోగదారులు మన బొగ్గును కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. ధరతో పాటు నాణ్యత కూడా కీలకమని, నాణ్యత లేని బొగ్గును వినియోగదారులు స్పష్టంగా తిరస్కరిస్తున్నారని చెప్పారు.
రాజ్యాంగ స్ఫూర్తితో దేశాభివృద్ధికి తోడ్పాటు
రాజ్యాంగం ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగుతూ దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని కృష్ణ భాస్కర్ పిలుపునిచ్చారు. అనేక మంది దేశభక్తుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం లభించిందని, ఆ తర్వాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అధ్యక్షతన రూపొందించిన రాజ్యాంగం దేశానికి దిశానిర్దేశం చేసిందన్నారు. సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించిన రాజ్యాంగం కారణంగానే భిన్నత్వంలో ఏకత్వంతో భారతదేశం ముందుకు సాగుతోందని చెప్పారు. మనతో పాటు స్వాతంత్ర్యం పొందిన అనేక దేశాల్లో సైనిక పాలనలు, తిరుగుబాట్లు జరిగినా భారత్ మాత్రం సంపూర్ణ ప్రజాస్వామ్యంతో ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. ఇది రాజ్యాంగ గొప్పతనమని పేర్కొన్నారు. ఈ వేడుకల్లో సింగరేణి డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు, ఏజీఎంలు, వివిధ విభాగాల అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు, కార్మికులు, సన్మాన గ్రహీతలు, ప్రభుత్వ–ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజలు పాల్గొన్నారు.


