మధిరలో సీఎం కప్ పోటీలు
గ్రామీణ క్లస్టర్లలో ఉత్సాహంగా క్రీడలు
ఒలింపిక్ స్థాయి క్రీడాకారులే లక్ష్యం
కాకతీయ, ఖమ్మం : రెండవ విడత సీఎం కప్ పోటీల్లో భాగంగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగాయి. మధిర పట్టణం, ఎర్రుపాలెం, చింతకాని మండలం కొదుమూరు కేంద్రాల్లో గ్రామీణ క్లస్టర్ స్థాయి పోటీలను నిర్వహించారు. మధిరలో జరిగిన పోటీలను జిల్లా యువజన సంక్షేమ అధికారి తుంబూరు సునీల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంపత్, తహసీల్దారు రాళ్లబండి రాంబాబు, ఎంఈఓ ప్రభాకర్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మిరియాల రమణ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖ ఆధ్వర్యంలో సీఎం కప్ పోటీలు ఐదు అంచెల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్రామీణ క్లస్టర్ నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల వరకు పోటీలు కొనసాగుతాయని చెప్పారు. ఆన్లైన్లో నమోదు చేసుకున్న క్రీడాకారులను ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తామని వివరించారు. జిల్లా స్థాయి అనంతరం రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి, ప్రతిభావంతులకు మెరుగైన శిక్షణ, సౌకర్యాలు కల్పించి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఒలింపిక్ స్థాయి క్రీడాకారులను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.


