మేడారంలో హైటెక్ భద్రత
మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా
కమాండ్ కంట్రోల్ నుంచే రియల్ టైమ్ పర్యవేక్షణ
డ్రోన్లు, ఏఐతో ‘మేడారం 2.0’ అమలు
తప్పిపోయే వారిని గుర్తించేందుకు జియో ట్యాగ్తో సమస్యకు పరిష్కారం
కాకతీయ ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూలో ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్

మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ స్పష్టం చేశారు. ఈసారి సుమారు మూడు కోట్ల మందికిపైగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో, గత అనుభవాల ఆధారంగా అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ జాతర నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా రియల్ టైమ్ పర్యవేక్షణ, భారీ పోలీస్ బలగాల మోహరింపు, ఏఐ డ్రోన్లు, ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థలు, ‘మేడారం 2.0’ కాన్సెప్ట్తో జాతర భద్రతను మరింత పటిష్టం చేసినట్లు వెల్లడించారు. గత జాతరల్లో ఎదురైన తప్పిపోయే ఘటనలను నివారించేందుకు జియో ట్యాగ్ బేస్డ్ ట్రాకింగ్ సిస్టమ్, క్యూఆర్ కోడ్ ట్యాగ్లను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణ నుంచి నేరాల నివారణ వరకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, భక్తులు పోలీస్ సూచనలు పాటిస్తూ సహకరిస్తే ఈసారి మేడారం జాతర భక్తులకు పూర్తిగా సురక్షితమైన అనుభవంగా నిలుస్తుందని కాకతీయకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎస్పీ అనేక విషయాలను వెల్లడించారు.. ఆ విషయాలను ఆయన మాటల్లోనే…
– గాదె సుమన్ / ములుగు ప్రతినిధి
ప్రశ్న : ఈసారి మేడారం మహా జాతర భద్రత విషయంలో ప్రభుత్వం ఎందుకు ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది?
జవాబు : మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచింది. ఈసారి సుమారు మూడు కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. గత జాతరల్లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, ఈసారి భక్తులు ఎవరూ తప్పిపోకుండా, శాంతిభద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా అత్యాధునిక సాంకేతికతతో జాతరను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

ప్రశ్న : మేడారం జాతర కోసం ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రాధాన్యత ఏమిటి?
జవాబు : జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మహా జాతరను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. జాతర ప్రాంతంలోని ట్రాఫిక్, రద్దీ, భద్రత, అత్యవసర పరిస్థితులన్నింటినీ ఈ కేంద్రం నుంచే రియల్ టైమ్లో పర్యవేక్షిస్తాం.

ప్రశ్న : పోలీస్ బలగాల ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?
జవాబు : జాతర భద్రత కోసం దాదాపు 13 వేల మంది పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. హీలియం బెలూన్లకు అమర్చిన పాన్–టిల్ట్–జూమ్ కెమెరాల ద్వారా ఎత్తు నుంచి రద్దీని విశ్లేషిస్తాం. తొక్కిసలాట జరిగే అవకాశమున్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకుంటాం.
ప్రశ్న : జాతర సమయంలో ట్రాఫిక్ జాబ్ నివారించేందుకు ఏం చర్యలు తీసుకుంటున్నారు.
జవాబు : ఈసారి మేడారం జాతరలో ట్రాఫిక్ జామ్ సమస్యను అధిగమించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసాము. రహదారుల వెంట ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసు వ్యవస్థను వినియోగించుకుంటున్నాం. రోడ్లపై ఏ కారణం చేతనైనా వాహనాలు కదలలేని స్థితిలో ఉన్నప్పుడు ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను 20 కి పైగా టోయింగ్ వాహనాలను అందుబాటులో ఉంచాం.
ప్రశ్న : ‘మేడారం 2.0’ అంటే ఏమిటి? ఇందులో కొత్తగా ఏం చేస్తున్నారు?
జవాబు : మేడారం 2.0 అంటే జాతర నిర్వహణలో ఆధునిక సాంకేతికతను పూర్తిగా వినియోగించడం. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, భక్తులకు సురక్షితమైన జాతర అనుభవం కల్పించడమే లక్ష్యం. ఇందులో భాగంగానే ‘టీజీ-క్వెస్ట్’ అనే అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టాం.
ప్రశ్న : టీజీ-క్వెస్ట్ డ్రోన్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
జవాబు : ఈ డ్రోన్ వ్యవస్థ ద్వారా దాదాపు 30 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అటవీ ప్రాంతం, జంపన్నవాగు, రద్దీ రహదారులపై నిరంతరం నిఘా ఉంటుంది. ఎక్కడైనా అసాధారణ పరిస్థితులు, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్కు సమాచారం చేరుతుంది.

ప్రశ్న : గత జాతరలో ఎక్కువ మంది తప్పిపోయారు. ఈసారి పరిష్కారం ఏమిటి?
జవాబు : గత జాతరలో దాదాపు 30 వేల మంది వరకు తప్పిపోయిన ఘటనలు నమోదయ్యాయి. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ‘జియోట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్స్ ట్రాకింగ్ సిస్టమ్’ ను ప్రవేశపెట్టాం. వొడాఫోన్–ఐడియా సంస్థ సహకారంతో ఈ విధానం అమలులోకి వస్తుంది.
ప్రశ్న : క్యూఆర్ కోడ్ జియో ట్యాగ్ల ఉపయోగం ఏమిటి?
జవాబు : పస్రా, తాడ్వాయి మార్గాల్లోని కౌంటర్లలో వృద్ధులు, పిల్లల వివరాలను నమోదు చేసి క్యూఆర్ కోడ్ గల జియో ట్యాగ్లను కడతాం. ఎవరైనా తప్పిపోయినా ఆ ట్యాగ్ను స్కాన్ చేస్తే వెంటనే వారి పూర్తి వివరాలు తెలుస్తాయి. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలో అమలు చేస్తున్నాం.
ప్రశ్న : నేరాల నియంత్రణకు ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు?
జవాబు : శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేకంగా 12 క్రైమ్ బృందాలు ఏర్పాటు చేశాం. ఆసుపత్రులు, పార్కింగ్ ప్రాంతాల్లో ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను ఉపయోగించి పాత నేరస్థులను గుర్తించే వ్యవస్థ ఉంది. అలాగే అనుమానాస్పద వస్తువులను గుర్తించే రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ను కూడా సిద్ధం చేశాం.
ప్రశ్న : భక్తులకు భాషా సమస్యలు రాకుండా ఏమైనా చర్యలు?
జవాబు : భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలుగు, ఇంగ్లీష్తో పాటు హిందీ, తమిళ భాషల్లోనూ వివరాల నమోదు చేసే సౌకర్యం కల్పించాం. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.
ప్రశ్న : భక్తులకు మీరు ఇవ్వదలచిన సందేశం?
జవాబు : భక్తులంతా పోలీస్, అధికారులు ఇచ్చే సూచనలను పాటిస్తూ సహకరించాలి. ఈసారి మేడారం మహా జాతరలో తప్పిపోతారనే భయం అవసరం లేదు. ప్రభుత్వం, పోలీస్ శాఖ పూర్తి అప్రమత్తతతో పనిచేస్తోంది. పోలీస్ అధికారులు నిర్దేశించిన సూచనలు పాటిస్తూ భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకోవడం వల్ల ఎలాంటి సౌకర్యాలకు లోన్ కాకుండా ఉంటుంది కావున భక్తులు పోలీసులకు సహకరించాలి. భక్తులందరికీ సురక్షితమైన, ప్రశాంతమైన జాతర అనుభవం కల్పించడమే మా లక్ష్యం.


