టెక్స్టైల్ పార్క్ పనుల నిర్వహణలో ప్రభుత్వం విఫలం
వరద కాలువ పనులు అర్ధాంతరంగా నిలిపివేత
రూ.160 కోట్ల పనులకు ఎందుకు బ్రేక్ వేశారు..
నిధుల్లేవన్న సాకుతో పనులు పక్కన పెట్టేశారు
అసమర్థ పాలనకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ
పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
కాకతీయ, గీసుగొండ : కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో వరద కాలువల బలోపేతానికి సంబంధించిన అత్యంత కీలక పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అర్థాంతరంగా నిలిపివేయడం దురదృష్టకరమని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు. పరిశ్రమల శాఖ జీఓ నెం.167 ప్రకారం రూ.160.92 కోట్లకు పరిపాలనా ఆమోదం ఇచ్చి, టెండర్లు పిలిచి పనులు ప్రారంభించిన తర్వాత ఇప్పుడు వాటిని నిలిపివేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వర్షాకాలంలో వరద ముంపును నివారించేందుకు ఈ ప్రాజెక్టు అత్యంత కీలకమని, గత రెండు వర్షాకాలాల్లో టెక్స్టైల్ పార్క్ పూర్తిగా మునిగిపోవడంతో ఈ పనులకు మరింత ప్రాధాన్యత ఏర్పడిందని గుర్తు చేశారు. భవిష్యత్తులో భారీ వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశముందని హెచ్చరించారు. వరదల భయంతో ఇప్పటికే పరిశ్రమల సిబ్బంది ఆందోళన చెందుతున్నారని, కొత్త పరిశ్రమలు రావాలంటే పెట్టుబడిదారులు భయపడుతున్న పరిస్థితి నెలకొందని ధర్మారెడ్డి తెలిపారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ద్వారా వరద కాలువల పనులను నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు అద్దం పడుతోందని మండిపడ్డారు. ఖాతా వివరాలు అందలేదన్న కారణం చూపి పనులు నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. గతంలో గొప్పలకు వెళ్లి టెండర్ల పేరుతో శంకుస్థాపనలు చేసి, ఇప్పుడు నిధులు లేవని చెప్పి పనులు ఆపేయడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు. పరిశ్రమల భద్రత, వేలాది కార్మికుల ఉపాధి, ప్రాంత అభివృద్ధిని తాకట్టు పెట్టే విధంగా వ్యవహరించడం సరికాదని, ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి వరద కాలువల బలోపేత పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పరిశ్రమల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని హెచ్చరించారు.

యంగ్ వన్ కంపెనీని సందర్శించిన ధర్మారెడ్డి
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లోని యంగ్ వన్ కంపెనీని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కంపెనీ యాజమాన్యంతో కలిసి పరిశ్రమలో కొనసాగుతున్న ఉత్పత్తి ప్రక్రియలు, కార్మికులకు కల్పిస్తున్న సదుపాయాలు, ఉపాధి అవకాశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్క్ ఏర్పాటు కోసం భూములు ఇచ్చిన కుటుంబాలకు, స్థానికులకు ఉపాధి అవకాశాల్లో మొదటి ప్రాధాన్యత కల్పించాలని యాజమాన్యాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ, సంగెం మండలాల మాజీ జడ్పీటీసీలు పోలీసు ధర్మారావు, గూడ సుదర్శన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చల్లా వేణుగోపాల్ రెడ్డి, పూండ్రు జైపాల్ రెడ్డి, బోడకుంట్ల ప్రకాష్, ముంత రాజయ్య, గుర్రం రఘు, పులి సారంగపాణి, యూత్ నాయకులు సిరీషే శ్రీకాంత్, గోనె నాగరాజు, అజార్, గాలి అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.


