టెంపుల్ సిటీ’కి బ్లూప్రింట్
రాములవారి ఆలయానికి రూ.350 కోట్లతో మాస్టర్ ప్లాన్
నాలుగు దశల్లో అభివృద్ధి పనులు
మాడ వీధుల విస్తరణకు తుది దశలో భూసేకరణ
ఇటీవల ఖమ్మం జిల్లా పర్యటనలో స్వయంగా సీఎం వెల్లడి
ప్రభావిత కుటుంబాలకు నగదు–ఫ్లాట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలత
శ్రీరామనవమి తర్వాత పనులు ప్రారంభించేలా ప్లాన్
కాకతీయ, భద్రాచలం : భద్రాద్రి రామయ్య ఆలయాన్ని టెంపుల్ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందుకు మాస్టర్ ప్లాన్తో ముందుడుగు వేసిన రేవంత్ సర్కారు.. బ్లూ ప్రింట్ను సిద్ధం చేసుకుని భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేస్తోంది. భద్రాచలం సీతారామచంద్ర స్వామివారి ఆలయాన్ని అయోధ్య తరహాలో ‘టెంపుల్ సిటీ’గా అభివృద్ధి చేసేందుకు రూ.350 కోట్లతో భారీ మాస్టర్ ప్లాన్ను సిద్ధం చేసింది. ప్రభుత్వ అనుమతి లభించగానే పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయ విస్తరణ, భక్తుల సౌకర్యాల పెంపు లక్ష్యంగా ఈ మాస్టర్ ప్లాన్ను నాలుగు దశల్లో అమలు చేయనున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. యాదాద్రితో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రధాన పుణ్యక్షేత్రాల అభివృద్ధికి రూపకల్పన చేసిన ప్రణాళికల్లో భద్రాచలం కీలకంగా నిలిచింది. స్వామివారి కళ్యాణం సందర్భంగా ఇప్పటికే మాడ వీధుల విస్తరణకు రూ.34.45 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పది ప్రముఖ ఆలయాల అభివృద్ధికి కేటాయించిన రూ.2,202.35 కోట్లలో భద్రాచలం ఆలయానికి రూ.350 కోట్లు కేటాయించారు.
నాలుగు దశల ప్రణాళిక
మాస్టర్ ప్లాన్ ప్రకారం మొదటి దశలో రూ.115 కోట్లతో ఆలయ ప్రాంగణ విస్తరణ, నూతన మండపాలు, ప్రసాద విభాగం, క్యూ హాల్స్, పరిపాలన భవనాల నిర్మాణం చేపడతారు. భక్తులకు దర్శన సౌకర్యాలు మెరుగుపడేలా ఈ దశను కీలకంగా భావిస్తున్నారు. రెండో దశలో రూ.35 కోట్లతో ఘాట్ల అభివృద్ధి, ఆలయ పరిసర రోడ్లు, విస్తా కాంప్లెక్స్ విస్తరణ, అడ్మిన్ బ్లాక్ నిర్మాణ పనులు చేపడతారు. మూడో దశలో రూ.100 కోట్లతో భక్తరామదాసు ప్లాజా, రామాయణ మ్యూజియం, మల్టీ లెవల్ పార్కింగ్, వాగ్గేయకారుడు నర్సింహదాసు పేరుతో ఆడిటోరియం నిర్మించనున్నారు. నాలుగో దశలో టెంపుల్ టౌన్ డెవలప్మెంట్లో భాగంగా హోటళ్లు, గిరిజన మ్యూజియం, రామవనం, పట్టణ సుందరీకరణకు మరో రూ.100 కోట్లు వెచ్చించనున్నారు.
భూసేకరణ వేగిరం..!
ఆలయ విస్తరణకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ వేగంగా సాగుతోంది. ఆలయం చుట్టూ ఉన్న మాడ వీధుల విస్తరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.34 కోట్ల నిధులను మంజూరు చేసింది. తూర్పు, పడమర, దక్షిణం దిశల్లో ఉన్న 43 ఇళ్లను తొలగించి సుమారు 1.30 ఎకరాల భూమిని సేకరించారు. ఈ భూసేకరణతో ఆలయ ప్రాంగణం విస్తరించి ఉత్సవాలు, భక్తుల రద్దీ సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు తగ్గనున్నాయి. భూసేకరణ వల్ల ప్రభావితమైన 39 నుంచి 40 కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం, పరిహారం ప్యాకేజీని ఖరారు చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.7.86 లక్షల నగదు పరిహారంతో పాటు పట్టణంలో నిర్మించిన ఫ్లాట్ను అందించనున్నారు. త్వరలోనే బాధిత కుటుంబాలకు చెక్కుల పంపిణీ ప్రారంభం కానుంది. వారు తరలివెళ్లిన అనంతరం విస్తరణ పనులు ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
భక్తుల సౌకర్యాలే లక్ష్యం
ప్రస్తుతం ఆలయ ప్రాంగణం ఇరుకుగా ఉండటం, మాడ వీధులు చిన్నవిగా ఉండటంతో భక్తులకు, ఉత్సవాల సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వసతి, రవాణా, పార్కింగ్, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఖమ్మం కలెక్టర్ ఆధ్వర్యంలో రూపొందించిన మాస్టర్ ప్లాన్ను ప్రభుత్వం పరిశీలించి మార్పులు–చేర్పులు చేసిన తర్వాత నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. శ్రీరామనవమి వేడుకల అనంతరం నిర్మాణ పనులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మాస్టర్ ప్లాన్ అమలుతో భద్రాచలం ఆలయం దేశవ్యాప్తంగా భక్తులను ఆకర్షించే టెంపుల్ సిటీగా రూపుదిద్దుకోనుందని అధికారులు భావిస్తున్నారు


