తెలంగాణ రైజింగ్’లో భాగస్వామ్యం అవ్వండి!
డావోస్ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్లకు శ్రీధర్ బాబు పిలుపు
2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% లక్ష్యం
పరిశ్రమలకు అనుకూల పాలసీలు… అపార అవకాశాలు
పెట్టుబడులు–ఉపాధే లక్ష్యం
‘ఇండియా పెవిలియన్’ ప్రారంభంలో ఆహ్వానం
దావోస్ : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచిన తెలంగాణలో పెట్టుబడులు పెట్టి ‘తెలంగాణ రైజింగ్’లో భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గ్లోబల్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) వార్షిక సదస్సులో భాగంగా దావోస్లో ఏర్పాటు చేసిన ‘ఇండియా పెవిలియన్’ ప్రారంభోత్సవంలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్న ఆయన, రాష్ట్ర పారిశ్రామిక దృక్పథాన్ని ప్రపంచానికి చాటారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడకుండా దానిని నిర్మించాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి చేర్చాలనే లక్ష్యంతో దార్శనికతతో కూడిన, ప్రణాళికాబద్ధమైన అడుగులు వేస్తున్నామని తెలిపారు. అదే కాలానికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లేలా నిపుణులు, పారిశ్రామికవేత్తలు, ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర రోడ్మ్యాప్ సిద్ధం చేశామని చెప్పారు.
కీలక రంగాలపై ఫోకస్
‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్లో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కీలక రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని శ్రీధర్ బాబు తెలిపారు. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, హెల్త్కేర్ ఇన్నోవేషన్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, హార్డ్వేర్ మాన్యుఫ్యాక్చరింగ్, ఐటీ, ఐటీఈఎస్, ఏరోస్పేస్, డిఫెన్స్, టెక్స్టైల్, అప్పారెల్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రోబేస్డ్ ఇండస్ట్రీస్, రెన్యూవబుల్ ఎనర్జీ, గ్రీన్ టెక్నాలజీస్ వంటి రంగాల్లో తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని వివరించారు. పరిశ్రమలకు అనుకూలమైన ఎకోసిస్టమ్, వేగవంతమైన అనుమతులు, స్థిరమైన పాలసీలే రాష్ట్ర బలమన్నారు.
పెట్టుబడులే ఉపాధి
కొత్త పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకువచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు. దావోస్ వేదికగా గత రెండేళ్లలోనే సుమారు రూ.2.5 లక్షల కోట్ల పెట్టుబడులను సమీకరించామని వెల్లడించారు. ఈ ఏడాదీ అదే స్ఫూర్తితో పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడే నవీన పాలసీలను ప్రపంచానికి వివరించి, దిగ్గజ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేస్తామన్నారు. ‘తెలంగాణ బ్రాండ్’ను మరింత విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా లైఫ్ సైన్సెస్ పాలసీ 2.0తో పాటు తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ (TAIH)ను దావోస్ వేదికగా లాంఛనంగా ఆవిష్కరించనున్నట్లు శ్రీధర్ బాబు ప్రకటించారు. ప్రపంచ పెట్టుబడుల పటంలో తెలంగాణను కీలక గమ్యంగా నిలపాలన్నదే తమ దృఢ సంకల్పమని ఆయన స్పష్టం చేశారు.


