యూత్ ఐడియాథాన్లో డీపీఎస్ విద్యార్థుల ప్రతిభ
రైతుల కోసం ‘ఫామ్ లింక్’ యాప్ అభివృద్ధి
ఏఐతో వ్యవసాయ మార్కెటింగ్కు కొత్త దారి
వినూత్న ఆలోచనలకు ఐఐటీ ఢిల్లీలో ప్రశంసలు
కాకతీయ , హన్మకొండ : పెండ్యాలలోని డీపీఎస్ వరంగల్ విద్యార్థులు ప్రతిష్టాత్మక యూత్ ఐడియాథాన్ కార్యక్రమంలో తమ సృజనాత్మకతను చాటుకున్నారు. ఆదివారం ఐఐటీ ఢిల్లీలో థింక్ స్టార్టప్–సీబీఎస్ఈ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొని పాఠశాలకు గర్వకారణంగా నిలిచారని చైర్మన్ వి. రవి కిరణ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఐడియాథాన్లో విద్యార్థులు మేధా పెండ్యాల, జోయా తహ్మీనా పాల్గొన్నారు. అధ్యాపకుడు కాసిపేట మనోజ్ రాజ్ సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ‘ఫామ్ లింక్’ అనే ఏఐ ఆధారిత యాప్ను అభివృద్ధి చేశారు. ఈ యాప్ ద్వారా రైతులు తమ ఉత్పత్తులను నేరుగా మార్కెట్లతో అనుసంధానం చేసి, సరైన ధరలు పొందే అవకాశముంటుందని విద్యార్థులు వివరించారు. వినూత్న ఆలోచనతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్న ఈ ప్రాజెక్ట్కు దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, నిపుణుల నుంచి ప్రశంసలు లభించాయి. ఆధునిక సాంకేతికతను వ్యవసాయ రంగ అభివృద్ధికి వినియోగించే దిశగా ఇది ఆదర్శంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో చైర్మన్ వి. రవి కిరణ్ రెడ్డి, ప్రిన్సిపాల్ *డా. ఇన్నారెడ్డి*తో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థులను అభినందించారు. భవిష్యత్తులోనూ సమాజానికి ఉపయోగపడే మరిన్ని వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని వారు ఆకాంక్షించారు.


