కదం తొక్కిన కామ్రేడ్స్… ఎర్రబారిన ఖమ్మం!
ఎటు చూసినా అరుణ పతాకాల రెపరెపలే
కిలోమీటర్ల కొద్ది నడిచొచ్చిన కామ్రేడ్స్
ఖమ్మం ప్రధాన వీధుల్లో జనసేవాదళ్ కవాత్
వేల మందిని ఆకట్టుకున్న కళారూపాలు
సీపీఐ శతాబ్ది ఉత్సవాలకు చారిత్రక ముగింపు
కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభ సందర్భంగా ఖమ్మం నగరం ఎర్రబారింది. కామ్రేడ్స్ కదం తొక్కగా… అరుణ పతాకాలు ఆకాశాన్నే తాకాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన పార్టీ కార్యకర్తలతో ఖమ్మం పురవీధులు కిటకిటలాడాయి. ప్రతి ఒక్కరి చేతిలో ఎర్రజెండా… ఎర్రని వస్త్రధారణతో నగరమంతా కమ్యూనిస్టు ఉద్యమ ఉత్సాహంతో మార్మోగింది. ఉదయం ఎనిమిది గంటల నుంచే సుదూర ప్రాంతాల నుంచి కార్యకర్తలు ఖమ్మానికి చేరుకున్నారు. నాగపూర్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ వంటి రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు సభకు హాజరయ్యారు. ప్రధాన రహదారులన్నీ కార్యకర్తల రాకతో దిగ్బంధితమయ్యాయి. ఎటు చూసినా అరుణ పతాకాల రెపరెపలే కనిపించాయి.

కిలోమీటర్ల కొద్ది నడిచిన కామ్రేడ్స్
భారీగా తరలివచ్చిన జనంతో ట్రాఫిక్ జామ్ కావడంతో, పలువురు కార్యకర్తలు కిలోమీటర్ల కొద్ది నడిచి ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా స్థలికి చేరుకున్నారు. వందలాది వాహనాలు నగరంలోకి రావడంతో ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. అయినా, అలసటను లెక్కచేయకుండా శ్రేణులు ముందుకు సాగాయి. ఈ సభలో యువత భారీ సంఖ్యలో పాల్గొనడం విశేషంగా మారింది. జనసేవాదళ్ కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో యువకులు, యువతులు తరలివచ్చారు. క్రమశిక్షణతో మూడు కిలోమీటర్ల మేర నడిచి సభా స్థలికి చేరుకున్న యువత… నాయకుల ఉపన్యాసాలకు, ప్రజానాట్యమండలి పాటలకు అలసిపోకుండా కేరింతలు కొట్టింది. వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన “ఎర్రజెండా… ఎర్రజెండా” పాటకు సభా ప్రాంగణం మొత్తం ఊగిపోయింది. పూనకం వచ్చినట్లుగా వేలాది మంది అరుణ పతాకాలను ఊపుతూ ఒక సరికొత్త విప్లవ వాతావరణాన్ని సృష్టించారు. యువత ఉత్సాహాన్ని చూసి ముఖ్యమంత్రి కూడా ఒక్కింత ఆశ్చర్యపోయినట్టు సభావర్గాలు పేర్కొన్నాయి.
మూడు ప్రదర్శనలు… వేలాది జనం
ముగింపు సభ సందర్భంగా ఖమ్మంలో మూడు భారీ ప్రదర్శనలు నిర్వహించారు.
మొదటి ప్రదర్శన పెవిలియన్ మైదానం నుంచి ప్రారంభమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జనసేవాదళ్ కార్యకర్తలు వరుసకు నలుగురు చొప్పున క్రమశిక్షణతో కదం తొక్కారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర సాగిన ఈ కవాతును నగరవాసులు ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా యువ మహిళల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పదేళ్ల లోపు చిన్నారులు కూడా లెఫ్ట్… రైట్… అంటూ కదం తొక్కుతూ భవిష్యత్తు తరమే మాదన్న సందేశాన్ని చాటి చెప్పారు. ఈ ప్రదర్శనకు సీపీఐ అగ్ర నేతలు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, చాడ వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం, బాగం హేమంతరావు తదితరులు నేతృత్వం వహించారు. జనసేవాదళ్ తర్వాత సింగరేణి కార్మికులు, యువ మహిళలు, పర్ష పద్మ నేతృత్వంలో నాగళ్లు చేతబూనిన రైతులు, కోయ–లంబాడ జానపద నృత్య కళాకారులు, వందలాది మంది డప్పు కళాకారులు ప్రదర్శనలో పాల్గొన్నారు. బతుకమ్మలతో మహిళలు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. న్యాయవాదులు, వైద్యులు, యువజన, విద్యార్థి సంఘాల కార్యకర్తలు కూడా ఈ కవాతులో భాగమయ్యారు. ఇటీవల ఏ రాజకీయ పార్టీ నిర్వహించని రీతిలో ఈ ప్రదర్శన సాగిందన్న అభిప్రాయం వ్యక్తమైంది.
మూడు దారులు… ఒకే లక్ష్యం
రెండో ప్రదర్శన నయాబజార్ కళాశాల నుంచి ప్రారంభమై మయూరి సెంటర్, జెడ్పీ సెంటర్, ఇల్లందు క్రాస్ రోడ్ మీదుగా సభా స్థలికి చేరుకుంది. దీనికి రాష్ట్ర సహాయ కార్యదర్శి తకెళ్లపల్లి శ్రీనివాసరావు, బోస్, కె. శంకర్, సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ నేతృత్వం వహించారు. మూడో ప్రదర్శన శ్రీశ్రీ విగ్రహం వద్ద నుంచి ప్రారంభమై రోటరీ నగర్, మమత రోడ్డు, ఇల్లందు క్రాస్ రోడ్ మీదుగా సభా స్థలికి చేరుకుంది. ఈ ప్రదర్శనకు జాతీయ సమితి సభ్యులు ఎస్కే సాబీర్పాషా, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి తదితరులు నాయకత్వం వహించారు. మొత్తంగా…ఎర్రజెండాల మధ్య ఖమ్మం నగరం చరిత్రాత్మక దృశ్యానికి వేదికగా నిలిచింది. వందేళ్ల ఉద్యమానికి తగ్గట్టే… మరో వందేళ్ల పోరాటానికి సిద్ధమన్న సంకేతాన్ని ఈ శతాబ్ది ముగింపు సభ గట్టిగా వినిపించింది.


