పార్టీలో ప్రశ్నిస్తున్నందుకే కక్ష
రాజకీయ కారణాలతోనే టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా తొలగింపు
కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం
కొత్త గౌరవ అధ్యక్షుడి ఎన్నుకున్నట్లుగా ప్రకటించారు
నాపై కుట్రల వెనుక కొంతమందికి లక్ష్యాలు
ఆ కుట్రదారులే నన్ను వేధింపులకు గురి చేస్తున్నారు.
ఇలాంటి పరిణామాలతో వ్యక్తిగతంగా నాకొచ్చే నష్టం ఏం లేదు
ఉద్దేశపూర్వకంగానే కేసీఆర్కు రాసిన లేఖ లీక్
పార్టీలో ఏం జరుగుతోందో అందరికీ తెలుస్తోంది!
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలనాత్మక లేఖ
పరోక్షంగా కేటీఆర్పై విమర్శలు.. ఆరోపణలు
కాకతీయ, తెలంగాణ బ్యూరో : బీఆర్ ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ప్రశ్నిస్తున్నందుకే కొంతమంది నాపై రాజకీయ కక్ష పెంచుకున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సంచలన ఆరోపణలు చేశారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా తనను తప్పించడం వెనుక కొంతమంది రాజకీయ లక్ష్యాలు.. దురుద్దేశాలు ఉన్నాయంటూ పరోక్షంగా బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆమె సోదరుడు కేటీఆర్ను ఉద్దేశించి అన్నారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కవితను తొలగిస్తూ.. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ను బుధవారం తెలంగాణ భవన్లో జరిగిన సంఘం కౌన్సిల్ సమావేశంలో ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత అమెరికా పర్యటనలో ఉండగా టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షరాలి పదవి నుంచి తప్పించడం.. నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవడంపై కవిత వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో కవిత టీబీజీకేఎస్తో తనకున్న అనుబంధాన్ని, ప్రస్థానాన్ని పేర్కొంటూనే.. అన్న కేటీఆర్పై పరోక్షంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు సంధించారు. ఆమె లేఖలో పేర్కొన్న అంశాలు ఈవిధంగా ఉన్నాయి.

టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా అవకాశం దక్కడం నా అదృష్టం..!
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పదేళ్లకాలంలో టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలిగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా మీకు సేవలందించాను. బుధవారం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి శుభాకాంక్షలు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్ లో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్పా ఒప్పా అనే అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్టుగా తెలుస్తోన్నది.
కార్మికులను ఏకతాటిపైకి తెచ్చా..!
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి బొగ్గు గని కార్మికులను ఏకతాటిపైకి తెచ్చి పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు నేను మొదటి నుంచి ముందు వరుసలో ఉండి పని చేశాను. 2015 ఆగస్టు 17వ తేదీన కొత్తగూడెంలో నిర్వహించిన టీబీజీకేఎస్ జనరల్ బాడీ సమావేశంలో 11 ఏరియాల నుంచి హాజరైన 1000 మందికి పైగా సభ్యుల సమక్షంలో నన్ను గౌరవ అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. కార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎన్నో పథకాలు అమలు చేయడంలో క్రియాశీలంగా పని చేశాను. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నేను పోరాడుతుంటే కొందరు నాపై కుట్రలు పన్నుతున్నారు. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా నాకు వచ్చే నష్టం ఏమీ లేకపోయినా, కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్న నన్ను తొలగించి వారి ఐక్యతను దెబ్బతీయడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తున్నది.
పార్టీలో ఏం జరుగుతోందో మీకందరికీ తెలుసని అనుకుంటున్నా..!
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో కొన్నాళ్లుగా జరుగుతోన్న పరిణామాలు మీకందరికి తెలిసే ఉంటుందని భావిస్తున్నాను. పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ గారి ప్రసంగంపై వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను నేను లేఖ రూపంలో తెలియజేశాను. నా తండ్రిగారైన కేసీఆర్ గారికి నేను గతంలోనూ ఇలాంటివి ఎన్నో లేఖలు రాశాను. నేను గతంలో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు కేసీఆర్ గారికి రాసిన ఆ లేఖను లీక్ చేశారు. ఆ లేఖను లీక్ చేసి నాపై కుట్రలకు పాల్పడుతున్న వారు ఎవరో బయట పెట్టాలని నేను కోరాను. పార్టీలో జరుగుతోన్న వ్యవహారాలను నేను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా నాపై కక్షగట్టారు. ఆ తర్వాత జరుగుతోన్న పరిణామాలు, ఘటనలు అన్ని మీ మననంలో ఉన్నాయనే అనుకుంటున్నాను. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసిన లేఖను లీక్ చేసిన కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే నాపైనే కక్షగట్టారు. ఆ కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారు.
కార్మిక చట్టాలకు విరుద్ధంగా సమావేశం
నేను అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకున్నట్టుగా ప్రకటించారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలి పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలిగా ఎళ్లవేళలా నేను మీ వెన్నంటే ఉంటాను. గడిచిన దశాబ్ద కాలంగా సంఘం గౌరవ అధ్యక్షురాలిగా, అంతకుముందు ఉద్యమ నాయకురాలిగా ఎలాంటి సేవలందించానో ఇకపైనా కార్మికుల కోసం అలాగే పని చేస్తాను. కార్మికులకు ఏ చిన్నకష్టం వచ్చినా మీకు అండదండగా ఉంటాననని మాట ఇస్తున్నాను. అంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ లేఖను ముగించారు.


