గగనతలంలో రంగుల పండుగ
గోల్కొండ కోటలో అట్టహాసంగా ప్రారంభమైన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్
గగనయాత్ర చేసిన మంత్రి జూపల్లి కృష్ణారావు
గంటన్నర పాటు 13 కిలోమీటర్ల సాహస విహారం
పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం : మంత్రి జూపల్లి
‘డెస్టినేషన్ తెలంగాణ’ బ్రాండ్ బలోపేతానికి అడుగు
కాకతీయ, హైదరాబాద్ : చారిత్రక గోల్కొండ కోట పరిసరాల్లో శుక్రవారం గగనతలం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది. గోల్ఫ్ క్లబ్ వేదికగా నిర్వహిస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వేడుకలకు లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రి జూపల్లి స్వయంగా హాట్ ఎయిర్ బెలూన్లో విహరించి అందరి దృష్టిని ఆకర్షించారు. గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ నుంచి ఆకాశంలోకి ఎగసిన బెలూన్, సుమారు గంటన్నర పాటు 13 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అప్పోజీగూడ శివారులో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ గగన విహారం తనకు మరిచిపోలేని అనుభూతిని ఇచ్చిందని మంత్రి తెలిపారు.

పర్యాటక రంగంలో కొత్త అధ్యాయం
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, తెలంగాణ పర్యాటక రంగంలో ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది అని అన్నారు. వినూత్న ఆలోచనలకు తెలంగాణ వేదికగా నిలుస్తోందని చాటిచెప్పడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. ఒకవైపు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ద్వారా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, ఆతిథ్యాన్ని ప్రపంచానికి చాటుతుండగా, మరోవైపు హాట్ ఎయిర్ బెలూన్, డ్రోన్ ఫెస్టివల్స్ ద్వారా ఆధునిక సాంకేతికత, భవిష్యత్ దృక్పథాన్ని పరిచయం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలోని సహజ సౌందర్యం, చారిత్రక వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ‘డెస్టినేషన్ తెలంగాణ’ బ్రాండ్ను బలోపేతం చేస్తూ, దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఇలాంటి సాహసోపేత కార్యక్రమాలు కీలకంగా మారతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పర్యాటకులు కేవలం సందర్శించడమే కాకుండా, ఒక విశేషమైన అనుభూతిని పొందేలా వినూత్న ఈవెంట్లను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
ఉపాధి అవకాశాలకూ దోహదం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పర్యాటక విధానంతో పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నామని, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తూ భాగస్వామ్య విధానంలో ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, నాణ్యమైన సేవలను అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి, ఆదాయ అవకాశాలు పెరగనున్నాయని చెప్పారు. “ఇది ఒక అద్భుత అనుభూతి. సంప్రదాయానికి గౌరవం ఇస్తూ, సాంకేతికతకు స్వాగతం పలుకుతూ తెలంగాణ పర్యాటక రంగాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతాం. నేడు ఆకాశంలో ఎగురుతున్న ఈ బెలూన్లు… తెలంగాణ పర్యాటక రంగం ప్రపంచ స్థాయి ఎత్తులకు చేరుకోబోతోందనే సంకేతం” అని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. ఈ ఫెస్టివల్ కుటుంబాలు, యువత, పిల్లలందరికీ మధుర జ్ఞాపకంగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరి, పర్యాటక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


