మూసీ ప్రాజెక్టుతో రియల్ బూమ్
ప్రాపర్టీ ధరలు హైక్ !
దాదాపు 15 నుండి 20 శాతం పెరుగుదల
రాజేంద్రనగర్, బాపుఘాట్, నాగోల్, ఉప్పల్ పరిసరాల్లో మళ్లీ రియల్ జోరు
ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ల నిర్మాణానికి ఇన్వెస్టర్ల ఆసక్తి
డీపీఆర్ రెడీ.. నేడో రేపో ఫైనల్ !
మార్చి నుంచి తొలి విడత పనులు
ఇప్పటికే రూ.4,100 కోట్ల రుణం మంజూరు
కాకతీయ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్’ ప్రాజెక్ట్ నగర రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త బూమ్కు కారణం అవుతోంది. అహ్మదాబాద్లోని సబర్మతి రివర్ ఫ్రంట్ నమూనాను అధ్యయనం చేసిన అనంతరం, ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మరింత భారీ స్థాయిలో ప్లాన్ చేయడంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు వల్ల మూసీ నది వెంట ఉన్న ప్రాంతాల్లో ప్రాపర్టీ ధరలు 15 నుండి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఆ ప్రాంతాల్లో..
ముఖ్యంగా రాజేంద్రనగర్, బాపుఘాట్, నాగోల్, ఉప్పల్ పరిసరాల్లో ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. దుబాయ్కు చెందిన ఏఎంఆర్ ప్రాపర్టీస్ వంటి అంతర్జాతీయ సంస్థలు రాజేంద్రనగర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 17 వద్ద ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ల నిర్మాణానికి ఆసక్తి చూపడం ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచింది. ఆసియా అభివృద్ధి బ్యాంకు ఈ ప్రాజెక్ట్ తొలి దశ కోసం రూ.4,100 కోట్ల రుణాన్ని మంజూరు చేయడంతో పనులు వేగవంతం కానున్నాయి. మార్చి నుంచి పనులు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా 55 కిలోమీటర్ల పొడవునా వాకింగ్ ట్రాక్స్, సైక్లింగ్ పాత్లు, రివర్ క్రాసింగ్ బ్రిడ్జిలు , గాంధీ సరోవర్ వంటి పర్యాటక ఆకర్షణలు నిర్మించనున్నారు.
మొదట దశలో 21 కిలోమీటర్లు..
మూసీ ప్రక్షాళనలో భాగంగా మొదటి దశలో 21 కిలోమీటర్లు మేర పనులు ప్రారంభించాలని భావిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా తెలిపారు. గండిపేట, హిమాయత్సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 21 కిలీ మీటర్లు తొలి దశ మూసీ నది అభివృద్ధి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీపీఆర్ కూడా రెడీ అయింది. సంక్రాంతిలోపు ఫైనల్ కానున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మార్చి 31 కల్లా తొలి దశ పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నాబార్డ్ నుంచి తీసుకున్న రూ.4,100 కోట్లతో ఈ పనులు ప్రభుత్వం ఈ పనులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
51 కి.మీ ఎలివేటెడ్ కారిడార్లు..
తెలంగాణలో మూసీ నది 240 కిలోమీటర్లు ప్రవహిస్తుందని చెప్పారు సీఎం రేవంత్. అనంతగిరి హిల్స్ నుంచి వాడపల్లి వరకు మూసీ ప్రవాహం ఉందని.. అందుకే మూసీ, ఈసీ నదులు కలిసే ప్రదేశంలో బాపుఘాట్ నిర్మిస్తామని ప్రకటించారు. అక్కడ గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ చేపట్టాని వెల్లడించారు. ఈ సందర్భంగా నదీ పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి జరుగుతుందని సీఎం నొక్కి చెప్పారు. ఇక జలవనరులను కలుషితం చేసి, కబ్జాలు చేసి ఫాంహౌస్లు నిర్మించారని.. వాటి డ్రైనేజీలను జంట జలాశయాలకు కలిపారని ప్రతిపక్షాలపై రేవంత్ మండిపడ్డారు. అందుకే ఆ డ్రైనేజీలను కూలగొట్టి, కబ్జాలపై చర్యలు తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గండిపేట నుంచి గౌరెల్లి వరకు.. మొత్తం 51 కిలోమీటర్ల మేర మూసీ నది అభివృద్ధి చేయనున్నారు. దే విధంగా 51 కిలోమీటర్ల పొడవునా ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామని ప్రభుత్వం చెబుతోంది.


