వివాదాలొద్దు
పక్క రాష్ట్రాలతో చర్చలకు సిద్ధం
పరస్పర సహకారంతో ముందుకుసాగుదాం
ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ
2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం
ప్రపంచమే మనవైపు చూసేలా ఫార్మా రంగంలో వృద్ది
రావిర్యాల ఈ-సిటీలో సీఎం రేవంత్ రెడ్డి
సుజెన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్ ప్రారంభోత్సవం
కాకతీయ, తెలంగాణ బ్యూరో: కృష్ణా నది జల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ-సిటీలో సుజెన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మా యూనిట్ ప్రారంభోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రానికి పంచాయితీ కావాలా?, నీళ్లు కావాలా? అని అడిగితే తాను నీళ్లే కావాలని కోరుకుంటానని స్పష్టం చేశారు. వివాదం కావాలా?, పరిష్కారం కావాలా? అని అడిగితే పరిష్కారమే కావాలని కోరుకుంటానని ఆయన అన్నారు. నీళ్ల వివాదం ముసుగులో రాజకీయ లబ్ధి పొందాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదని, రాజకీయాలకు అతీతంగా సమస్యల పరిష్కారం కోసం అందరూ సహకరించాలని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. మన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఏపీ సీఎంకు విజ్ఞప్తి..
ఈ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేస్తూ.. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టవద్దని కోరారు. అడ్డంకుల వల్ల కేంద్ర ప్రభుత్వ నిధులు రావడం లేదని, రాష్ట్రంపై ఆర్థికభారం పడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. తాము వివాదం కోరుకోవడంలేదని.. పరిష్కారమే కోరుకుంటున్నామని స్పష్టంచేశారు. రాజకీయ ప్రయోజనాలు కాదని.. ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం అవసరమని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. రెండు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకోకపోతే సమస్యలు పరిష్కారం కావని చెప్పుకొచ్చారు. ఇందుకోసం పక్క రాష్ట్రంతో చర్చలు కొనసాగుతాయని తెలిపారు. ఏపీ అయినా, కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, మహారాష్ట్ర అయినా.. పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, పరస్పర సహకారమే కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
30 ఏళ్ల నిరంతర శ్రమ వల్లే అభివృద్ధి
1995 నుంచి 2025 వరకు 30 ఏళ్ల నిరంతర శ్రమ వల్లే హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడగలుగుతోందని రేవంత్ అన్నారు. జర్మన్ టెక్నాలజీతో దక్షిణ భారత దేశంలోనే ఐవీ ఫ్లూయిడ్స్ తయారీలో గొప్ప సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయం అన్నారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో భావనగా సుజెన్ మెడికేర్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయడం సంతోషం అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్ ను విడుదల చేశాం.. క్యూర్, ప్యూర్, రేర్ మూడు భాగాలుగా తెలంగాణ అభివృద్ధి ఉంటుంది. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమిగా, 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమిగా తెలంగాణను తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ క్యూర్, ప్యూర్ పై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రపంచంలోని గొప్ప నగరాలతో హైదరాబాద్, తెలంగాణ పోటీ పడుతోందని సీఎం చెప్పారు. జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూయార్క్ తో తెలంగాణ పోటీ పడుతోందని రేవంత్ అన్నారు. అందులో భాగంగా యువ పారిశ్రామికవేత్తలు ప్రారంభించే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామన్నారు. దేశంలో ఉత్ప త్తి చేసే బల్క్ డ్రగ్స్ లో 40 శాతం తెలంగాణ నుంచి ఉత్పత్తి అవుతున్నాయన్నారు. ప్రపంచమే మనవైపు చూసేలా ఫార్మా రంగంలో రాణిస్తున్నామన్నారు. మన దగ్గర చదువుకుని వెళ్లిన వారు గ్లోబల్ కంపెనీలకు సీఈవోలుగా ఉన్నారని, ఇది మనకు ఎంతో గర్వకారణం అన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు.


