శాంతి భద్రతల్లో ఏఆర్ పాత్ర కీలకం!
వరంగల్ సీపీ సన్ ప్రీత్సింగ్
సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ వార్షిక తనిఖీలు
ఆకట్టుకున్న రుద్రమ ఉమెన్స్ స్పెషల్ ఫోర్స్ విన్యాసాలు
కాకతీయ, హనుమకొండ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణతో పాటు శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ పోలీసుల పనితీరు అభినందనీయమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం నగరంలోని సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగాన్ని ఆయన తనిఖీ చేశారు. ఉదయం పోలీస్ పరేడ్ మైదానానికి చేరుకున్న కమిషనర్కు ఆర్మ్డ్ రిజర్వ్ అధికారులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సాయుధ పోలీసులు నిర్వహించిన పరేడ్ను కమిషనర్ తిలకించారు.
ఆయుధ పరిజ్ఞానం, శిక్షణపై ప్రత్యేక దృష్టి
తనిఖీల సందర్భంగా సిబ్బంది ఆయుధాలపై ఉన్న పరిజ్ఞానం, ఆయుధాల వినియోగ విధానాలు, ఆయుధ పరేడ్, వ్యాయామం, యోగా వంటి అంశాలను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ విభాగాల్లో ప్రతిభ చూపిన సిబ్బందికి క్షేత్రస్థాయిలోనే రివార్డులు ప్రకటించి ప్రోత్సహించారు. అదేవిధంగా డాగ్ స్క్వాడ్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, మోటార్ విభాగం, ఆయుధాగారం వంటి విభాగాల పనితీరును పరిశీలించిన కమిషనర్, సిబ్బంది పనితీరుపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఏర్పాటైన అనంతరం కమిషనర్ ఆదేశాలతో తొలిసారిగా ఏర్పాటు చేసిన రుద్రమ ఉమెన్స్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ విభాగంలో పనిచేస్తున్న మహిళా పోలీసులు కమాండో తరహా శిక్షణ, దేహదారుఢ్య శిక్షణ, ఆయుధ శిక్షణ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా పోలీసులు కళ్లకు గంతలు కట్టుకుని ఆయుధాలను విడదీయడం, తిరిగి అమర్చడం వంటి క్లిష్టమైన విన్యాసాలను ప్రదర్శించారు. వాటిని తిలకించిన కమిషనర్ సన్ప్రీత్ సింగ్ రుద్రమ ఉమెన్స్ స్పెషల్ పోలీస్ ఫోర్స్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ రివార్డులు ప్రకటించారు. తనిఖీల అనంతరం కమిషనర్ మాట్లాడుతూ, పోలీస్ అధికారులు, సిబ్బంది అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని, శాఖాపరమైన సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీలు సురేష్కుమార్, శ్రీనివాస్, రవి, ట్రైనీ ఐపీఎస్ మనిషా నేహ్రా, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, ఆర్ఐలు స్పర్జన్ రాజ్, సతీష్, శ్రీధర్, చంద్రశేఖర్, ఆర్ఎస్ఐలు తదితర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


