ప్రభుత్వ విద్యా వ్యవస్థ చిన్నాభిన్నం!
బీఆర్ఎస్ పాలనలో 6 వేల స్కూల్స్ మూసివేత
కాంగ్రెస్ ఏడాదిలోనే మరో 1500 స్కూల్స్కు తాళాలు వేసింది
ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలతో కాలేజీలు మూత
విద్యార్థులపై భారం పెడితే ఉద్యమమే
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న బండి సంజయ్
కాకతీయ, హైదరాబాద్ : బీఆర్ఎస్ పదేళ్ల పాలన, కాంగ్రెస్ రెండేళ్ల పాలన ఫలితంగా తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విద్య విఫలమైతే ఒక తరం నష్టపోతుందని, ప్రస్తుతం రాష్ట్రంలో అదే జరుగుతోందని ఆయన హెచ్చరించారు. శనివారం హైదరాబాద్ శంషాబాద్లోని ఎస్సాస్సార్ కన్వెన్షన్లో జరిగిన ఏబీవీపీ 44వ రాష్ట్ర మహాసభల్లో పాల్గొన్న బండి సంజయ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో 6 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వాటిని తెరవకపోగా ఒక్క ఏడాదిలోనే మరో 1500 స్కూల్స్ మూసివేశారని విమర్శించారు. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్న హామీ గాలికొదిలేశారని ఎద్దేవా చేశారు. ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో వందలాది కాలేజీలు మూతపడుతున్నా ప్రభుత్వం స్పందించడంలేదని ఆరోపించారు. గత నాలుగేళ్లుగా దాదాపు రూ.10 వేల కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ఈ విషయంలో విద్యార్థులను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. విద్యా రంగ సమస్యలపై ఏబీవీపీ చేస్తున్న ఉద్యమాలను మరింత ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.

నల్లజెండాలు టెర్రరిస్టులవి… ఏబీవీపీదే జాతీయ జెండా
దేశంలో నల్లజెండాలు ఎగరేసేది టెర్రరిస్టులు, నక్సలైట్లు మాత్రమేనని బండి సంజయ్ విమర్శించారు. నల్లజెండాలను ఎదిరిస్తూ జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించింది ఏబీవీపీ, బీజేపీ కార్యకర్తలేనని గుర్తు చేశారు. 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం కోసం పోరాడిన చరిత్ర ఏబీవీపీదేనని తెలిపారు. అమరుల త్యాగాల స్పూర్తితోనే మోదీ ప్రభుత్వం 370 ఆర్టికల్ రద్దు, అయోధ్య రామమందిర నిర్మాణం సాధించిందన్నారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా పానగల్కు చెందిన సామాజిక కార్యకర్త భీమనపల్లి శ్రీకాంత్కు ‘జనమంచి గౌరీశంకర్ జీ యువ పురస్కార్’ను కేంద్ర మంత్రి బండి సంజయ్ అందజేశారు. హెచ్ఐవీ బాధితులు, వారి పిల్లల కోసం చేస్తున్న సేవలను ఆయన అభినందించారు.
జనమంచి గౌరీశంకర్ జీ ఏబీవీపీకి ఐకాన్ అని, విద్యా సమస్యలపై పోరాటాలు చేసి ఎంతో మంది విద్యార్థి నాయకులను తయారు చేసిన నేత అని కొనియాడారు. నక్సల్స్ బెదిరింపులను ఎదుర్కొంటూ కూడా ఏబీవీపీ సిద్ధాంతాల కోసం నిలబడిన నాయకుడిగా ఆయనను గుర్తు చేశారు.
విద్య విఫలమైతే… తరం నష్టమే
పదేళ్ల బీఆర్ఎస్, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో స్కూళ్లలో టీచర్లు లేరు, మౌలిక వసతులు లేవు, అయినా ప్రభుత్వానికి సిగ్గు లేదని బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ రెండేళ్ల పాలనతో రెండు తరాలు నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. గౌరీశంకర్ జీ స్పూర్తితో విద్యా రంగ సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని ఈ మహాసభల వేదికగా ఏబీవీపీ నాయకులను కోరారు.


