క్షణాల్లో స్పందించిన పోలీసులు.. ఏటీఎం దొంగ అరెస్ట్!
డయల్–100కు సమాచారం.. వెంటనే రంగంలోకి మియాపూర్ పోలీసులు
సంఘటనా స్థలంలోనే నిందితుడి అదుపు
పెద్ద నష్టం తప్పిందని ఏసీపీ వెల్లడి
కాకతీయ, సైబరాబాద్ : డయల్–100కు అందిన సమాచారంపై క్షణాల్లో స్పందించిన మియాపూర్ పోలీసులు, ఏటీఎం దొంగతనానికి పాల్పడుతున్న నిందితుడిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకొని అప్రమత్తతను చాటుకున్నారు. మాదాపూర్ జోన్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హఫీజ్పేట్ ప్రాంతం మార్థండనగర్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం వద్ద 04-01-2026 రాత్రి దొంగతనం జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక విచారణలో ఏటీఎం దొంగతనానికి పాల్పడుతున్న *వి. కాటమయ్య (24)*ను పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు అనంతపురం జిల్లా, అక్కంపల్లి మండలం, జార్జ్పేట్ గ్రామం వాసిగా గుర్తించారు. నిందితుడిపై చట్టప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల చాకచక్యంతో ఏటీఎం వద్ద పెద్ద నష్టం తప్పినట్లు మియాపూర్ ఏసీపీ సీహెచ్ వై. శ్రీనివాస్ కుమార్ వెల్లడించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా డయల్–100కు వచ్చే ప్రతి సమాచారంపై తక్షణ చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని మియాపూర్ పోలీసులు ప్రజలను కోరారు.


