రిటైర్డ్ అధ్యాపకుల సంక్షేమమే నా ధ్యేయం
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా
: ఎంపీ డా.కడియం కావ్య
డైరీ ఆవిష్కరించిన ఎంపీ
సంఘ భవనానికి రూ.10 లక్షల హామీ
కాకతీయ, హనుమకొండ : హనుమకొండలో రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పెన్షనర్స్ డే మరియు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ… రిటైర్డ్ కళాశాల అధ్యాపకులు విద్యారంగానికి అందించిన సేవలు అమూల్యమైనవని కొనియాడారు. వారి కృషి వల్లే అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలిపారు. పదవీ విరమణ అనంతరం కూడా తమ జ్ఞానం, అనుభవాలను సమాజ హితానికి వినియోగించడం అభినందనీయమని పేర్కొన్నారు.
పెన్షనర్ల సమస్యలపై హామీ
అనంతరం సంఘం విడుదల చేసిన డైరీని ఎంపీ ఆవిష్కరించి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెన్షనర్ల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రిటైర్డ్ కళాశాల అధ్యాపకుల సంఘ భవన అభివృద్ధికి రూ.10 లక్షల నిధులు మంజూరు చేస్తానని ఎంపీ డా.కడియం కావ్య ప్రకటించారు. అలాగే ప్రస్తుతం లీజుపై ఉన్న సంఘ భవనాన్ని మరో 30 సంవత్సరాల పాటు లీజు పొడిగించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. సీనియర్ సిటిజన్లు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ముఖ్యంగా మహిళలు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రిటైర్డ్ అధ్యాపకులు తమ అనుభవాలను సమాజానికి ఉపయోగపడేలా కొనసాగించాలని కోరారు. వచ్చే ఏడాది పెన్షనర్స్ డే కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు పరస్పర ఆత్మీయత, ఐక్యతను పెంపొందిస్తాయని ఎంపీ పేర్కొన్నారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు పులిసారంగా పాణి, ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు, కార్యదర్శి మల్లారెడ్డి, ఆర్థిక కార్యదర్శి రాజయ్య, సంయుక్త కార్యదర్శులు కృష్ణమూర్తి, ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు సంఘ సభ్యులు పాల్గొన్నారు.


