గందరగోళంగా మునిసిపల్ ఓటర్ల జాబితా
వేరే నియోజకవర్గాల ఓటర్లు మున్సిపాలిటీల్లో నమోదు
పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
స్టేట్ ఎలక్షన్ కమిషన్కు బీజేపీ నేతల ఫిర్యాదు
కాకతీయ, హైదరాబాద్ : మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇటీవల విడుదలైన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుల్లో అనేక చోట్ల తీవ్రమైన వ్యత్యాసాలు, తప్పిదాలు ఉన్నట్లు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆరోపించింది. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల కమిటీ చైర్మన్, మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు అధికారికంగా మెమోరాండం సమర్పించారు. ఈ బృందంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్. గౌతం రావు, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, సీనియర్ నాయకులు డా. ఎస్. ప్రకాష్ రెడ్డి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అఫైర్స్ కమిటీ సభ్యుడు ఆంటోనీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మర్రి శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 117 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులను వార్డు వారీగా పరిశీలించగా, అనేక ప్రాంతాల్లో ఓటర్ల నమోదు విషయంలో తీవ్రమైన అసమానతలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. మిర్యాలగూడ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కొంతమంది ఓటర్లు దేవరకొండ మున్సిపాలిటీ ఓటర్ లిస్టుల్లో నమోదైనట్లు గుర్తించామన్నారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలోకి రాని కొన్ని గ్రామపంచాయతీలకు చెందిన ఓటర్లు కూడా మున్సిపల్ ఓటర్ లిస్టుల్లో కనిపించాయని పేర్కొన్నారు.
దూర గ్రామాల ఓటర్ల నమోదు
దేవరకొండ నుంచి సుమారు 15–20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొట్టిముక్కుల గ్రామానికి చెందిన ఓటర్లు దేవరకొండ మున్సిపాలిటీ ఓటర్ లిస్టుల్లో నమోదు కావడం గమనించామని తెలిపారు. ఇది ఓటర్ లిస్టుల తయారీలో జరిగిన తీవ్రమైన నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని విమర్శించారు. సాధారణంగా మున్సిపల్ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో రూపొందించిన ఓటర్ లిస్టును ఆధారంగా తీసుకుని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రక్రియలు కొనసాగుతాయని, అయితే గతంలోనూ కిందిస్థాయిలో చేర్పులు–తొలగింపుల వల్ల ఇలాంటి తప్పిదాలు చోటుచేసుకున్నాయని గుర్తు చేశారు. అప్పట్లో కూడా ఈ అంశాలను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ నేపథ్యంలో డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుల్లో చోటుచేసుకున్న వ్యత్యాసాలపై పూర్తిస్థాయి ఎంక్వైరీ జరపాలని, బాధ్యత వహించాల్సిన అధికారులు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే వార్డు వారీగా, మున్సిపాలిటీ వారీగా ఓటర్ లిస్టులను సరిచేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ను బీజేపీ కోరింది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుల్లో కనిపిస్తున్న ఈ లోపాలు ప్రజాస్వామ్య ప్రక్రియపైనే అనుమానాలు కలిగిస్తున్నాయని బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.


