ఉద్యమకారుల హక్కుల కోసం భూ పోరాటం
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కాకతీయ, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా మానకొండూరులో భూ పోరాటానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని సుమారు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఉద్యమకారులతో కలిసి ఆక్రమించి గుడిసెలు వేయించారు. ఎన్నికల హామీ ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూ పోరాటానికి ముందు కరీంనగర్లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన కవిత, అనంతరం మానకొండూరుకు చేరుకుని ఉద్యమాన్ని ప్రారంభించారు. ఉద్యమకారుల త్యాగాల ద్వారానే తెలంగాణ సాధ్యమైందని, అయినా వారికి ఇప్పటికీ గౌరవం దక్కలేదని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఉద్యమకారుల గుర్తింపు పేరుతో మళ్లీ కమిటీలను ఏర్పాటు చేసి కాలయాపన చేయడం సరికాదని కవిత స్పష్టం చేశారు. ఏ ఊరిలో ఎవరు ఉద్యమకారులో అక్కడి ప్రజలే నిర్ణయిస్తారని, ప్రజలు సూచించిన వారినే జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9లోగా పెన్షన్, సంక్షేమ బోర్డు, ఇంటి స్థలాల హామీలు నెరవేర్చకపోతే భూ పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ భూ పోరాటం కరీంనగర్కే పరిమితం కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందని, హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల్లోనూ ఉద్యమాలు జరుగుతాయని కవిత ప్రకటించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం ఆగదని, ఇది ఉద్యమకారుల ఆత్మగౌరవ పోరాటమని ఆమె స్పష్టం చేశారు.


