బాల కార్మిక వ్యవస్థపై జీరో టాలరెన్స్
జనవరి 1 నుంచి ‘ఆపరేషన్ స్మైల్’
కాకతీయ, సిరిసిల్ల : బాలల సంరక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (ఎస్సిపిసిఆర్) సభ్యురాలు మర్రిపెళ్లి చందన స్పష్టం చేశారు.జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు జిల్లాలో ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ మహేష్ బి. గితేతో కలిసి వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చందన మాట్లాడుతూ. చిన్న పిల్లలతో వెట్టిచాకిరి చేయించడం, పనుల్లో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, అలాంటి యజమానులపై క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు.బాల కార్మికులు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ 1098 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతోనే బాలల రక్షణ సాధ్యమవుతుందన్నారు.రక్షించిన పిల్లలు తిరిగి బాల కార్మికులుగా మారకుండా పునరావాస కార్యక్రమాలు చేపట్టే బాధ్యత సంబంధిత శాఖల అధికారులపై ఉందని, బాల కార్మిక రహిత సమాజమే లక్ష్యంగా అందరూ పనిచేయాలని సూచించారు.అనంతరం ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ… బాలల హక్కుల పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. బాల కార్మికులపై ఫిర్యాదులు అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా అదనపు ఎస్పీ చంద్రయ్య ఆధ్వర్యంలో సిరిసిల్ల, వేములవాడ డివిజన్లలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పరిశ్రమలు, హోటళ్లు, వ్యాపార సముదాయాలు, గోదాములు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపడతామని తెలిపారు.
పాఠశాలలకు వెళ్లకుండా డ్రాపౌట్ అయిన పిల్లల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి, వారిని తిరిగి చదువుల బాట పట్టించే చర్యలు తీసుకుంటామని చెప్పారు.2025లో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ కార్యక్రమాల ద్వారా 18 ఏళ్ల లోపు పిల్లలతో పనిచేయించిన 22 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, 129 మంది పిల్లలను సంరక్షణలోకి తీసుకున్నట్లు గుర్తు చేశారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజాం, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అంజయ్య, ఎస్ఐలు, వివిధ శాఖల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


