మేడారం జాతరకు ఏర్పాట్లు పూర్తి చేయాలి
భక్తులకు అసౌకర్యం లేకుండా చూడాలి
క్యూ లైన్ నిర్మాణంలో వేగం పెంచాలి
ములుగు జిల్లా కలెక్టర్ దివాకర
ఆలయ ప్రాంగణంలో మౌలిక వసతుల పర్యవేక్షణ
కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రపంచ ప్రసిద్ధి గాంచిన శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతరకు ముందస్తుగా మొక్కులు చెల్లించేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా క్యూ లైన్ నిర్మాణాల్లో వేగం పెంచాలని స్పష్టం చేశారు. శనివారం ఎస్.ఎస్. తాడ్వాయి మండలం మేడారంలోని శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల పరిసరాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి అవసరమైన సూచనలు చేశారు.
ఆదివారం భక్తుల రద్దీపై అప్రమత్తత
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదివారం సెలవు రోజు కావడంతో ముందస్తు మొక్కులు చెల్లించేందుకు భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పనులను జాగ్రత్తగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. మోడల్ క్యూ లైన్ల నిర్మాణాన్ని పరిశీలించిన ఆయన, పనుల్లో జాప్యం లేకుండా వేగవంతం చేయాలని, క్యూ లైన్లలో నిల్చున్న భక్తులకు తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు. ఆలయ ప్రాంగణంలోని భారీ రాతి స్తంభాలపై త్వరితగతిన బ్రాకెట్లను ఏర్పాటు చేయాలని, ఫ్లోరింగ్ పనులను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ స్తంభాల ఏర్పాటు ద్వారా రాత్రివేళల్లో కూడా భక్తులకు సౌకర్యం కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి అభివృద్ధి పని నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ వీరస్వామి, ఆర్ అండ్ బి ఈఈ సురేష్, తహసిల్దార్ సురేష్బాబు, సంబంధిత గుత్తేదారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


