సైబర్ మోసం… మాజీ ఐజీ ప్రాణం తీసింది!
రూ.8.10 కోట్ల సైబర్ ఫ్రాడ్కు బలైన పంజాబ్ మాజీ ఐజీ
పాటియాలా నివాసంలో తుపాకితో కాల్చుకున్న అమర్ సింగ్ చాహల్
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
12 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం
కాకతీయ, నేషనల్ డెస్క్ : భారీ సైబర్ మోసం ఒక మాజీ ఉన్నతాధికారిని బలి తీసుకుంది. పంజాబ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీ) అమర్ సింగ్ చాహల్ (65) సైబర్ ఫ్రాడ్లో రూ.8.10 కోట్ల వరకు నష్టపోయి తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం పాటియాలాలోని తన నివాసంలో తుపాకితో కాల్చుకున్న ఆయన, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లోనే కాకుండా ప్రజల్లోనూ తీవ్ర కలకలం రేపింది. పాటియాలాలోని తన ఇంట్లో భద్రతా సిబ్బందికి చెందిన రివాల్వర్తో అమర్ సింగ్ చాహల్ కాల్చుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందిన పది నిమిషాల్లోనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న ఆయన్ని పార్క్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స ఫలించక ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
12 పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం
ఘటనా స్థలం నుంచి 12 నుంచి 16 పేజీల వరకు ఉన్న సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ లేఖను పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ను ఉద్దేశించి రాసినట్లు సమాచారం. అందులో తాను ఎలా సైబర్ మోసానికి గురయ్యానో, ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనలను వివరించినట్లు పోలీసులు తెలిపారు. గత అక్టోబర్లో ఓ మోసపూరిత కంపెనీలో అమర్ సింగ్ చాహల్ పెట్టుబడులు పెట్టడం ప్రారంభించినట్లు దర్యాప్తులో తేలింది. మొదట తన సొంత డబ్బు రూ.1 కోటి పెట్టగా, ఆ తర్వాత కంపెనీ నిర్వాహకుల ఒత్తిడితో స్నేహితులు, బంధువుల నుంచి అప్పులు చేసి మరిన్ని కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.8.10 కోట్ల వరకు నష్టపోయినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ మోసంపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు కూడా ఆయన లేఖలు రాసినట్లు సమాచారం.
వివాదాస్పద నేపథ్యం… కొనసాగుతున్న దర్యాప్తు
అమర్ సింగ్ చాహల్ సేవా కాలంలో వివాదాలు కూడా ఉన్నాయి. 2015లో జరిగిన బెహబల్ కలాన్, కోట్కపురా కాల్పుల ఘటనల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్, ఆయన కుమారుడు సుఖ్బీర్ సింగ్ బాదల్తో పాటు పలువురు పోలీసు అధికారులపై సిట్ చార్జిషీట్ దాఖలు చేసింది. తాజా ఆత్మహత్య ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల బారిన ఒకప్పుడు రాష్ట్ర పోలీసు వ్యవస్థలో కీలకంగా పనిచేసిన అధికారి కూడా పడటం, చివరకు ప్రాణాలు తీసుకోవడం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. సైబర్ మోసాలపై మరింత అప్రమత్తత అవసరమన్న హెచ్చరికగా ఈ ఘటన మారింది.


