ఆనంద్పై ఆరా!
సీ-సెక్షన్లో ఏడేళ్లుగా విధులు
ప్రజావాని నుంచి సీడీఎంఏకు లేఖ..
ప్రజావాణిలో ఫిర్యాదుతో కదిలిన యంత్రాంగం
బల్దియా అధికారులను వివరణ కోరిన సీడీఎంఏ
సీ-సెక్షన్ ఉద్యోగికి మెమో జారీ
కాకతీయ, వరంగల్ : వరంగల్ మహానగర పాలక సంస్థ (జీడబ్ల్యూఎంసీ)లో సీ-సెక్షన్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న ఆనంద్ వ్యవహారం ప్రస్తుతం బల్దియాలో హాట్ టాపిక్గా మారింది. ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్లో చక్రం తిప్పుతున్నాడన్న ఆరోపణలు, ఉద్యోగుల బదిలీల్లో ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియా పాలకవర్గంలో ఓ బడా నేత అండతో ఆనంద్ తనకు నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా సీ-సెక్షన్లో సూపరింటెండెంట్గా ఏడేళ్లుగా పనిచేస్తున్నాడన్న అంశం తీవ్ర చర్చకు దారి తీసింది. అదే సమయంలో సీ-1 సెక్షన్కు కూడా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం.
ఒకే సెక్షన్లోనే ఏళ్ల తరబడి!
ఒకే సెక్షన్లో సుదీర్ఘకాలం పనిచేయడంతో ఉన్నతాధికారులు, పాలకవర్గంలో పలుకుబడి పెంచుకుని ‘తాను చెప్పిందే వేదం’ అన్నట్లు వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతర్గత బదిలీల్లో సైతం అర్హత లేని వారిని ఆర్ఐలుగా నియమించడంలో చక్రం తిప్పినట్లు బల్దియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాలపరిమితి ముగిసిన ఉద్యోగులను పక్కన పెట్టి, తనకు అనుకూలంగా ఉండేవారికే బదిలీలు కల్పించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో పలువురు సీనియర్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకే చోట మూడేళ్లకు మించి పని చేయరాదన్న నిబంధన ఉన్నప్పటికీ, ఆనంద్ ఏడేళ్లుగా అదే సెక్షన్లో కొనసాగుతున్నాడంటూ కొందరు ఉద్యోగులు ఇటీవల ప్రజాభవన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు ప్రజావాణి నుంచి సీడీఎంఏకు లేఖ వెళ్లగా, ఆనంద్ వ్యవహారంపై వివరణ కోరుతూ జీడబ్ల్యూఎంసీకి ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.
ఆనంద్కు మెమో జారీ
దీంతో బల్దియా ఉన్నతాధికారులు ఆనంద్కు మెమో జారీ చేశారు. ప్రస్తుతం ఆనంద్ వివరణ తయారీలో నిమగ్నమైనట్లు, ఆ వివరణను మరో ఉద్యోగితో సిద్ధం చేయిస్తున్నట్లు కార్యాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా, తాను సీ-సెక్షన్లో నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలే పని చేశానని, ఏడేళ్లు అవాస్తవమని తన వివరణలో పేర్కొంటున్నట్లు సమాచారం. అయితే, మూడేళ్లకే బదిలీ చేయాల్సిందే కదా అన్న ప్రశ్న బల్దియాలో మళ్లీ తెరపైకి వచ్చింది. ఆనంద్పై వస్తున్న మరో ప్రధాన ఆరోపణ ఏమిటంటే… తన బావమరిది బదిలీని అడ్డుకోవడంలో శాయశక్తులా ప్రయత్నించడమే. పరకాల మున్సిపాలిటీ నుంచి వరంగల్కు డిప్యుటేషన్పై వచ్చిన 31 మంది పీహెచ్ వర్కర్లను తిరిగి పంపించాలని ఎమ్మెల్యే ఆదేశాల నేపథ్యంలో కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. అందులో 30 మంది తిరిగి వెళ్లినా, ఒకరు మాత్రం ఇప్పటికీ వరంగల్లోనే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఒక్కరు ఆనంద్ బావమరిది కావడం, అతని డిప్యుటేషన్ కొనసాగేందుకు ఆనంద్ పెద్దఎత్తున లాబీయింగ్ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు ఉన్నా అమలు కాకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
బల్దియాలో ఎంతోమంది సూపరింటెండెంట్లు, అధికారులు ఉన్నా ఆనంద్కే ప్రత్యేక ప్రాధాన్యం ఎందుకని ఉద్యోగ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరి ఆనంద్ వ్యవహారంపై కమిషనర్ చర్యలు తీసుకుంటారా? లేక రాజకీయ అండతో వ్యవహారం అలాగే కొనసాగుతుందా? అన్నది వేచిచూడాల్సిందే.


